టీటీడీ శ్రీ పద్మావతి చిన్న పిల్లల గుండె ఆస్పత్రికి అరుదైన రికార్ట్ ను సొంతం చేసుకుంది. ఇక్కడి వైద్యులు నెల రోజుల వ్యవధిలో రెండు గుండె శస్త్రచికిత్సలను విజయవంతగా పూర్తి చేశారు.
తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గుండె సమస్యలతో బాధపడుతున్న ఎందరో పిల్లలను ఈ ఆస్పత్రి కాపాడింది. ఎన్నో ఘనతలు సాధించిన టీటీడీ శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయకు మరో అరుదైన ఘనత దక్కింది. నెల రోజుల వ్యవధిలో రెండవ గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా చేసి అద్భుతం సృష్టించింది. అంతేకాక గుండె తరలింపు సమయంలో ఎటువంటి గ్రీన్ ఛానల్ ను ఉపయోగించలేదు. పక్క ప్రణాళికతో చెన్నైలో బ్రెయిన్ డెడ్ అయిన రెండేళ్ల బాలుడి హృదయాన్ని సేకరించి పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంలో ఉన్న 13 నెలల పాపకు మళ్లీ ప్రాణం పోశారు. ఈ సందర్భంగా వైద్యులను టీటీడీ ఈవో ధర్మారెడ్డి అభినందించారు.
పల్నాడు జిల్లా మాచర్ల ప్రాంతానికి చెందిన 13 నెలల పాప గుండె తీవ్రంగా దెబ్బతింది. ఆ చిన్నారి తల్లిదండ్రులు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పాపను పరీక్షించిన వైద్యులు గుండెను మార్చాలని చెప్పి.. తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె ఆస్పత్రికి తీసుకెళ్లమని సూచించారు. ఈ క్రమంలోనే మూడు నెలల క్రితం పాపను తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్ల గుండె ఆస్పత్రికి తీసుకొచ్చారు. పాపకు సరిపోయే గుండె కోసం డాక్టర్లు జీవన్ దాన్ లో పేరు నమోదు చేశారు. గుండె దొరికే వరకు పాప ఆరోగ్యాన్ని మందులతో కాపాడుతూ వచ్చారు.
ఈక్రమంలోనే చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో రెండేళ్ల బాబుకు బ్రెయిన్ డెడ్ అయ్యిందని, బాలుడి తల్లిదండ్రులు గుండెను దానం చేసేందు సిద్ధంగా ఉన్నారని శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డికి తెలిసింది. ఆంధ్రప్రదేశ్ జీవన్దాన్ సంస్థ, డాక్టర్ గణపతి టీమ్తో డైరెక్ట్ శ్రీనాథ్ రెడ్డి సమన్వయం చేసుకున్నారు. టీటీడీ సహకారంతో ఓ అంబులెన్స్ తో పాటు మరో ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసుకుని వైద్య బృందం ఆదివారం రాత్రికే చెన్నై చేరుకుంది. గ్రీన్ ఛానల్ అవసరం లేకుండా 2గంటల 15 నిముషాల్లో గుండెను తిరుపతి ఆసుపత్రికి తీసుకుని వచ్చేలా ప్రణాళికను వేశారు.
వైద్యులు ఒక్క సెకన్ కూడా వృథా చేయకుండా సోమవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో గుండెను తిరుపతి ఆస్పత్రికి తీసుకొచ్చారు. అనంతరం డాక్టర్ గణపతి నేతృత్వంలోని వైద్య బృందం ఉదయం 4.30 గంటలకు గుండె మార్పిడి శస్త్ర చికిత్స ప్రారంభించి.. 9.30 గంటలకు విజయవంతంగా పూర్తి చేసింది. రూ. 30 లక్షల ఖర్చయ్యే ఈ శస్త్ర చికిత్స టీటీడీ ప్రాణదానం, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శ్రీ పథకాల కింద పూర్తి ఉచితంగా చేశారు. మరో మూడు నాలుగు రోజులు పాపను వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలో ఉంచి తరువాత సాధారణ వార్డుకు మారుస్తారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
టీటీడీ శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆస్పత్రికి ఇటీవలే గుండె మార్పిడి శస్త్ర చికిత్సలకు అనుమతి లభించింది. ఇలా అనుమతి లభించిన తర్వాత నెలరోజులోనే రెండు గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు ఇక్కడి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులను ఈవో ధర్మారెడ్డి అభినందించారు. తమ పాప ప్రాణాలు కాపాడిన టీటీడీకి, వైద్యులకు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. మరి.. టీటీడీ శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె ఆస్పత్రి సృష్టించిన అరుదైన రికార్డ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.