నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుండెపోటుకు గురైయ్యారు. దాంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు నెల్లూరు లోని అపోలో ఆస్పత్రికి ఆయనను తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గుండెలోని రెండు వాల్వ్ లు మూసుకుపోయినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 2019లో వైసీపీ తరపున ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు చంద్రశేఖర్ రెడ్డి. కాగా ఇటీవల గుండెపోటుతో మరణించిన మేకపాటి గౌతమ్ రెడ్డికి బాబాయ్ అవుతారు చంద్రశేఖర్ రెడ్డి.
మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. మెరుగైన వైద్యం కోసం చెన్నె అపోలో ఆసుపత్రికి తరలించారు. చెన్నైకి తరలిస్తున్న క్రమంలో మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి. నాకు అన్ని పరీక్షలు నిర్వహిచారని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఆయన తెలిపారు. అయితే కొన్ని పరీక్షలకు సంబంధించి పరికరాలు ఇక్కడ అందుబాటులో లేకపోవడంతో మద్రాస్ అపోలో ఆస్పత్రికి తరలిస్తున్నట్లు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను నెల్లూరు ఆస్పత్రి యాజమాన్యం పూర్తి చేసిందని ఆయన పేర్కొన్నారు.
అయితే కొన్ని రోజుల క్రితం మేకపాటి తన తండ్రి అని ఓ యువకుడు మీడియా ముందుకు రావడంతో వార్తల్లో నిలిచారు చంద్రశేఖర్ రెడ్డి. వరుస సమస్యలతో సతమతమవుతన్న మేకపాటికి మరోసారి గుండెపోటు వచ్చింది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండె పోటు వచ్చిందని తెలియడంతో.. ఆయన అభిమానులు, అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపినట్లు సమాచారం.