ఏపీలో మొదలైన పీఆర్సీ వివాదం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన పీఆర్సీ తమకి సంతృప్తి ఇవ్వలేదని ఉద్యోగులు నిరసన బాట పట్టారు. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్న ఇలాంటి సమయంలో ఇప్పుడు ఉద్యోగులను దూరం చేసుకునే చర్యలు.. సీఎం జగన్ కి రాజకీయంగా మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు ప్రత్యేక కారణం లేకపోలేదు. 1983 తరువాత ఏపీలో జరిగిన ప్రతి సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులే కీలక పాత్ర పోషించారు. వారిని అక్కున చేర్చుకున్నవారు సీఎంలు అయ్యారు. వారి నమ్మకాన్ని కోల్పోయిన వారు పదవులకి దూరం అయ్యారు. మరి.. ప్రభుత్వ ఉద్యోగులు కారణంగా ఏ నేతల తలరాతలు తారుమారయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సీనియర్ ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో..
సీనియర్ ఎన్టీఆర్ 1984 సంవత్సరంలో తెలుగు దేశం పార్టీ స్థాపించి.. భారీ విజయంతో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత పాలనా పరంగా ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల చాలా ఇబ్బందులు తలెత్తాయి. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1985లో మాలి పటేల్, పట్వారీలను (మునసబు, కరణాలను) రద్దు చేశారు. ఈ నిర్ణయం అప్పట్లో పెను సంచలనమే కాక.. ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి రాజేసింది. ఈ క్రమంలో 1989 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తి కూడా ఈ ఓటమికి ప్రధాన కారణంగా అప్పట్లో చెప్పుకున్నారు.
ఇది కూడా చదవండి : ఏపీలో రోడ్డెక్కిన ప్రభుత్వ ఉద్యోగులు! కలెక్టరేట్ల ముట్టడి!
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో..
చంద్రబాబు 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎం గా పని చేశారు. ఆయన కూడా ప్రభుత్వ ఉద్యోగులను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఉద్యోగులకు వ్యతిరేకంగా అనేక కఠిన నిర్ణయాలు తీసుకోవడం, ప్రభుత్వ ఉద్యోగులను జన్మభూమి వంటి కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడం, ఉద్యోగులపై ఒక నిఘా యంత్రాన్నే ఏర్పాటు చేయడం వంటి నిర్ణయాల పట్ల ఉద్యోగులు తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. ఇలా ఉద్యోగులపై అదనపు పని బారాన్ని మోపడమే కాక.. వీడియో కాన్ఫిరెన్స్ లు అంటూ ఉద్యోగులపై పట్టు కోసం ప్రయత్నాలు చేశారు. దీంతో.. 2009లో జరిగిన ఎన్నికల్లో ఉద్యోగులు టీడీపీకి దూరం అయ్యారు. దీంతో.. చంద్రబాబు అధికారం కోల్పోక తప్పలేదు.
ఉద్యోగుల శక్తి అర్ధం చేసుకున్న వైఎస్సార్
2004, 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా గెలిచారు. ఆయన హయాంలో ప్రభుత్వ ఉద్యోగులతో సత్సంబంధాలనే కొనసాగించారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎలాంటి నిరసన, అసంతృప్తి వ్యక్తం కాలేదు. ఆ తర్వాత ఆయన మృతి, రాష్ట్రం రెండుగా చీలడం తదితర పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులతో సహా ప్రజలు కూడా అపార అనుభవం కలిగిన చంద్రబాబుకే ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో గెలిచి సీఎం పీఠం అధిరోహించిన చంద్రబాబు.. గతంలో మాదిరే మరోసారి ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరించారు. ముఖ్యంగా ప్రభుత్వ నిర్ణయాలతో టీచర్లు ఎక్కువగా ఇబ్బంది పడ్డారనే విమర్శలు వచ్చాయి. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడపోవడానికి, జగన్ సీఎంగా గెలవడానికి ఉద్యోగుల అసంతృప్తి కూడా ప్రధాన కారణంగా చెప్తారు విశ్లేషకులు.
సీఎం జగన్ హయాంలో..
2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ విజయం సాధించడానికి ప్రధాన కారణం సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని ప్రకటించడమేకాక ఉద్యోగుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడం. వీటి ఫలితంగా 2019 ఎన్నికల సమయంలో ఉద్యోగ సంఘాలు వైసీపీకి అనుకూలంగా పని చేశాయి. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ కొన్ని హామీలను నేరవేర్చినప్పటికి.. ఉద్యోగుల అతి ప్రధాన డిమాండ్ అయిన పీఆర్సీ విషయంలో మాత్రం ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగా లేవని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి.
ఇది కూడా చదవండి : ఏపీ పీఆర్సీ వల్ల ఉద్యోగులకి లాభమా? నష్టమా?
ముఖ్యంగా నూతన పీఆర్సీ వల్ల వేతనాలు తగ్గుతాయని.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా నూతన పీఆర్సీ జీవోలను రద్దు చేయకపోతే.. సమ్మె తప్పదని హెచ్చరిస్తున్నారు. అటు చూస్తే.. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సీఎం జగన్ ధోరణి సరైంది కాదని పలువురు విశ్లేషిస్తున్నారు. ఉద్యోగుల్లో అసంతృప్తి ఇలానే కొనసాగితే.. మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. రానున్న కాలంలో పీఆర్సీ విషయంలో వైసీపీ ప్రభుత్వ చర్యలు ఏవిధంగా ఉండనున్నాయో చూడాలి. మరి.. సీఎం జగన్ ఇచ్చిన పీఆర్సీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.