ప్రస్తుత సమాజంలో మనిషి తన స్వార్థం మాత్రమే చూసుకుంటున్నారు.. ఎదుటి వారు ఏమైనా పట్టించుకోవడం లేదు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలనే ఆలోచన లేకుండా పోతుంది.. ఎక్కడో అక్కడ ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకుంటూ తమ మంచి మనసు చాటుకుంటున్నారు.
ఈ రోజుల్లో ఒకరికొకరు సాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే సొంత మనుషులకు కూడా ఎటువంటి అవసరం వచ్చినా, ఆపద ఉన్నా సాయం చేయడానికి ముందుకు రావడం లేదు. ఎవరో కొందరు మాత్రమే స్నేహితులకు, బంధుమిత్రులకు ఇబ్బందులను అర్దం చేసుకొని సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. నేటి సమాజంలో జాలి, కరుణ, దయ అనేవి లేకుండా పోయాయి. తోచిన సాయం చేయాలి..అందరు కలిసి ఉండాలి.. ఐకమత్యంతో ఉండాలి.. పైకి ప్రగల్భాలు పలికినా.. వాస్తవిక జీవితంలో పాటించేవాళ్లు మాత్రం తక్కువగా ఉంటారు. తోటి వారికి సాయపడాలనే తపన ఉన్నవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ కోవకు చెందిన వారే ఈ హోమ్ గార్డులు. సాయం చేయాలంటే ధనవంతులు కానక్కర్లేదు… ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటుంటారు. కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని పెద్ద మనసు చేసుకొని సహాయం చేశారు హోం గార్డ్స్.. పూర్తి వివరాల్లోయి వెళితే..
మాచర్ల పట్టణంలో హోం గార్డుగా పనిచేస్తున్న ఆత్మాంజనేయులు అనే ఉద్యోగి గత సంవత్సరం అక్టోబర్ నెలలో గుండెపోటుతో మరణించాడు. అకస్మాత్తుగా ఇంటియజమాని చనిపోవడంతో అతని కుటుంబం ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో ఆత్మాంజనేయులు సహోద్యోగులు అంతా కలిసి ఆర్థికంగా ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. వెంటనే జిల్లా పోలీస్ ఉన్నాతాధికారులని సంప్రదించి హోం గార్డులు అంతా తమ ఒక రోజు గౌరవ వేతనాన్ని ఆత్మాంజనేయులు భార్యకు అందజేశారు. అందరి ఒకరోజు సాలరీ రూ.5,38,000 చెక్కును అతని భార్య తిరుపతమ్మకు అందించారు. తాము చిరుద్యోగులమైనా తోటి వారికి సాయపడాలని తోచిన సాయం అందించి వారి ఉన్నతమైన వ్యక్తిత్వాన్నిచాటుకున్నారు.మానవత్వాన్ని చాటుకున్న హోం గార్డులను ఎస్పీ రవిశంకర్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. హోమ్ గార్డులు చేసిన మంచి పనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి.