హీరో విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన తన ప్రతి సినిమాను తెలుగులోకి డబ్ చేసి.. విడుదల చేస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విశాల్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విశాల్ తెలుగు మూలాలు ఉన్న తమిళ నటుడు. ఆయన తండ్రి జీకే రెడ్డి.. తెలుగు వాడు. కానీ ఆయన చెన్నైలో సెటిల్ అయ్యారు. తెలుగు, తమిళ్లో ఆయన ఎన్నో చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ఇక విశాల్ నటించిన పందెంకోడి సినిమా ఆయనకు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చింది. అప్పటి నుంచి ఆయన తన ప్రతి సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నాడు. తాజాగా విశాల్ నటించిన లాఠీ చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రీరీలిజ్ ఈవెంట్ తిరుపతిలో జరిగింది. ఏపీ వచ్చిన హీరో విశాల్.. మంగళవారం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలవనున్నారు. ఆ వివరాలు…
జగన్ అంటే తనకు ఎంతో ఇష్టమన్న విశాల్.. ఆయన సీఎం అయ్యాక ఇంతవరకు కలవలేదని.. ఇప్పుడు కలిసే అవకాశం వచ్చిందని తెలిపాడు. 2019 ఎన్నికలకు ఏడాది ముందే.. పాదయాత్ర సమయంలోనే.. జగన్.. ఏపీ ముఖ్యమంత్రి అవుతారని.. తాను చెప్పినట్లు.. ఈ సందర్భంగా విశాల్ ప్రస్తావించాడు. తాను ఓటు వేస్తే.. జగన్కే వేస్తాను అన్నాడు. అయితే నేడు సీఎంతో భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని.. జగన్ సీఎం అయ్యాక ఒక్కసారి కూడా కలవలేదని.. ఇప్పుడు అవకాశం రావడంతో.. కలుస్తున్నానని తెలిపాడు.
అలానే తాను కుప్పం నుంచి పోటీ చేయబోతున్నానంటూ జరుగుతున్న ప్రచారంపై కూడా విశాల్ స్పందించాడు. ‘‘నేను వైసీపీలో చేరి.. కుప్పంలో నుంచి పోటీ చేయబోతున్నాను అంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదు. నేను కుప్పంలో పోటీ చేయడం లేదు. మాకు కుప్పంలో అనేక వ్యాపారాలు ఉన్నాయి. అక్కడ ప్రతిదీ నాకు తెలుసు. అయితే ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన నాకు లేదు. ప్రజలకు సేవ చేసే ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులే. ప్రజాసేవ చేయాలంటే.. ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదు. హీరోగా చేస్తూ.. ఎమ్మెల్యే కన్నా ఎక్కువ అభిమానాన్ని సంపాదించుకున్నాను’’ అన్నారు. ఏది ఏమైనా.. హీరో విశాల్.. జగన్ని కలవడం.. సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.