ప్రస్తుతం సమాజంలో ప్రేమకు ఉన్న అర్ధాన్నే మార్చేస్తున్నారు యువత. ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి.. తమ కోరికలు తీర్చుకుని ముఖం చాటేసిన సంఘటనలు రోజుకు ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తనను మూడు సంవత్సరాలుగా ప్రేమించి, తన వెంట తిప్పుకుని.. తీరా పెళ్లి చేసుకుందాం అనే సరికి ముఖం చాటేస్తున్నాడని ఓ యువతి నడిరోడ్డుపై ధర్నాకు దిగింది. స్థానికంగా చర్చనీయాంశంగా మారిన ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని హిందూపురంలో చోటు చేసుకుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిందూపురం మండలానికి చెందిన ఓ యువతి అనంతపురం జిల్లా గుత్తిలోని ఓ కళాశాలలో ఎంబీఏ పూర్తి చేసింది. ఇక ఆ యువతి కాలేజీలో చదువుకుంటున్న సమయంలో కర్నూలు జిల్లా పెద్దకడుబూరు ప్రాంతానికి చెందిన గణేష్ పరిచయం అయ్యాడు. ఆమె వెంటపడుతూ.. ప్రేమిస్తున్నాను అని, పెళ్లి కూడా చేసుకుంటాను అని మాయమాటలు చెప్పి నమ్మించాడు. దాంతో అతడి మాటలు నమ్మిన యువతి ప్రేమించడం మెుదలు పెట్టింది. మూడేళ్లు తన వెంట తిప్పుకున్న గణేష్ పెళ్లి మాట ఎత్తగానే ముఖం చాటేస్తున్నాడు అంటూ.. ప్రియుడి కోసం ధర్నాకు దిగింది ప్రియురాలు.
ఈ క్రమంలోనే తాజాగా ఆ యువతి పెళ్లి చేసుకుందాం అని గణేష్ తో చెప్పింది. దానికి అతడు నువ్వు దళితురాలివి అనే కారణం చెప్పి పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఆ యువతి చెప్పుకొచ్చింది. గణేష్ పై ఇప్పటికే పోలీసు స్పందన కార్యక్రమంలో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో గణేష్ ను పిలిచి పోలీసులు కౌన్సిలింగ్ సైతం ఇచ్చారు కానీ అతడు ఒప్పుకోవడం లేదని వారు తెలిపారు. దాంతో విసిగిపోయిన యువతి తనకు న్యాయం చేయాలంటూ.. స్థానిక అంబేడ్కర్ సర్కిల్ వద్ద శనివారం కేవీపీఎస్ నాయకులతో కలిసి ధర్నాకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాడతానని ఆ యువతి చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయమై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే గణేష్ పై కేసు నమోదు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.