అతడు ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్.. గ్యాంగ్ స్టర్.. షార్ప్ షూటర్.. అతడు ఏదైన సూపారీ పుచ్చుకుంటే ఇక అంతే సంగతులు. వాడి కథ ముగిసినట్టే. ఈక్రమంలోనే అతడిలో మార్పు వచ్చింది. సడన్ గా అందరికి యోగా నేర్పిస్తూ సాధారణ జీవితం గడుపుతున్నాడు. ఇదేదో సినిమా స్టోరీలా ఉందేంటి అనుకుంటున్నారా? సినిమా కథలా ఉండటం నిజమే కానీ ఇది నిజంగా నిజం. ఉత్తరాఖండ్ లో మెుదలైన అతడి ప్రస్థానం ఢిల్లీ మీదుగా తూర్పుగోదావరిలోని రాజమహేంద్రవరం దగ్గర వరకు సాగింది. అతడే ప్రతాప్ సింగ్.. అతడి గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ప్రతాప్ సింగ్.. ఉత్తరాఖండ్ లోని ఫితోడ్ గఢ్ గ్రామంలో జన్మించాడు. తండ్రి ఆర్మీ అధికారి. దాంతో తాను కూడా ఆర్మీలో చేరాలని కలలు కన్నాడు. కానీ పోలియో వల్ల అవిటితనం అతడి కలను కల్లలు చేసింది. అదీ కాక తన సవతి తల్లి మాటలు పడలేక అక్కడి నుంచి పారిపోయి ఢిల్లీ చేరాడు. ఓ గ్యాంగ్ లో చేరి తక్కువ కాలంలోనే మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ గా పేరు పొందాడు.
అప్పట్లో ఢిల్లీలోని కళ్యాణ్ పూర్ లో అడుగు పెట్టాలంటేనే ఒక్కొక్కరికి వణుకు పుట్టేది అంటేనే అర్థం చేసుకోవచ్చు ప్రతాప్ సింగ్ ఆగడాలను. ఈక్రమంలో నే 16 హత్య కేసులతో సంబంధం ఉన్నప్రతాప్ సింగ్ ను ఏలూరు జిల్లా పినకడిమిలో జరిగిన హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో అతడికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించారు. దీంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ లో అతడు తన శిక్షను పూర్తి చేశాడు.
జైలులో ఉన్నప్పుడు ఖైదీలలో పరివర్తన తేవడానికి ప్రణవ సంకల్ప సమితి ఆధ్వర్యంలో యోగా నేర్పించారు. ఆ 9 నెలల శిక్షణా కాలంలోనే ప్రతాప్ సింగ్ ధ్యానం, జపం, యోగా నేర్చుకుని మారిపోయాడు. తన నేర జీవితాన్ని వదిలి పూర్తిగా యోగ నేర్పడంలో మునిగి పోయాడు. తనలా ఎవరూ కాకుడదని తన జీవితాన్ని వివరిస్తూ నలుగురికి యోగా నేర్పుతు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు. ప్రతాప్ సింగ్ ను గుంటూర్ కలెక్టర్ సైతం మెచ్చుకున్నారు.
తాజాగా జరుగుతున్న ఆజాదీ కా అమృతోత్సవాల్లో భాగంగా ప్రణవ యోగ సంకల్ప సమితి వ్యవస్థాపకుడు పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో యోగా గురువులను సత్కరించారు. ఇదే కార్యక్రమంలో ప్రతాప్ సింగ్ను నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ సన్మానించారు. మరి చెడు మార్గాన్ని వీడి నలుగురికి మంచి నేర్పుతున్న ప్రతాప్ సింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.