తాము ఎంతగానో అభిమానిచే కుటుంబ సభ్యులు చనిపోతే వారు పడే బాధ అంతా ఇంతా కాదు. ఇటీవల తమకు దూరమైన వారి జ్ఞాపకార్థం వారి విగ్రహాలను ఇంట్లో ఏర్పాటు చేస్తున్నారు. కొంత మంది ఏకంగా ఆ విగ్రహాలు తమ కుల దైవంగా పూజిస్తూ పూజలు కూడా చేస్తున్నారు. తాజాగా ఓ తండ్రి 11 ఏళ్ల క్రితం చనిపోయిన తన కూతురు జ్ఞపకార్థం ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిత్యం పూజలు చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ వెంకటాచలం మండలంలోని కాకుటూరు గ్రామానికి చెందిన చెంచయ్య, లక్ష్మమ్మ లకు ఐదుగురు సంతానం. వీరి సంతానంలో నాలుగో కూతురు సుబ్బలక్ష్మమ్మ. ఆమె పుట్టిన తర్వాత చెంచయ్య కుటుంబ ఎన్నో కష్టాల నుంచి గట్టెక్కింది.. ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు. అప్పటి నుంచి సుబ్బలక్ష్మమ్మ ని అందరూ పంచ ప్రాణాలుగా చూసుకుంటున్నారు. సుబ్బలక్ష్మమ్మ చదువులో కూడా బాగా రాణించింది. డిగ్రీ పూర్తి చేసిన ఆమె అటవీశాఖలో ఉద్యోగం కూడా సంపాదించింది. తమ కూతురు మంచి ఉద్యోగం సంపాదించిందన్న ఆనందం అంతలోనే దూరమైంది.. ఒక రోడ్డు ప్రమాదంలో సుబ్బలక్ష్మమ్మ కన్నుమూసింది. దీంతో చెంచయ్య కుటుంబ కన్నీటి సంద్రంలో మునిగిపోయింది.
ఈ క్రమంలోనే చెంచయ్యకు ఒకరోజు సుబ్బలక్ష్మమ్మ కలలో కనిపించి తనకు గుడి కట్టించాల్సిందిగా కోరిందట. తన కూతురు కోరిక మేరకు వెంటనే గుడి కట్టించి గుడిలో సుబ్బలక్ష్మమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిత్యం పూజలు చేయడం ప్రారంభిచాడు చెంచయ్య. అంతేకాదు ప్రతి సంవత్సరం ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాడు. పెళ్లి చేసి కూతురిని అత్తారింటికి పంపిచామా బాధ్యత తీరిందా అనుకునే ఈ కాలంలో ఒక తండ్రి తన కూతురుకి గుడి కట్టించి పూజలు చేయడం.. నిజమైన తండ్రి ప్రేమకు ఇదో గొప్ప నిర్వచనం అంటూ జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.