ఆంధ్రప్రదేశ్లో తొలకరి వర్షాలు కురవడం ప్రారంభమయ్యాయంటే కొన్ని ప్రాంతాల ప్రజలు తెగ సంతోషంలో మునిగిపోతుంటారు. ముఖ్యంగా రాయలసీమ ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి పంటపొలాల్లో వజ్రాల వేట కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అదృష్టం కొద్ది చాలా మందికి ఇక్కడ వజ్రాలు లభించి లక్షాధికారులు అయ్యారు.
ప్రపంచంలో వజ్రాలకు ఎంత విలువ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. చారిత్రక ప్రసిద్ధి గాంచిన వజ్రాలు చాలా వరకు భారత దేశంలో లభించినవే కావడం విశేషం. వజ్రాలు నాణ్యతను భట్టి లక్షలు, కోట్లలో విలువ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో తొలకరి వర్షం వస్తే చాలు కొన్ని ప్రాంతాల వారు వజ్రాల వేట కొనసాగిస్తుంటారు. ముఖ్యంగా కర్నూల్ ప్రాతంలో తొలకరి వర్షాలు ప్రారంభం అయితే చాలు చిన్నాపెద్దా తేడా లేకుండా పొలాల్లో వజ్రాల వేట కొనసాగిస్తుంటారు. గతంలో చాలా మంది రైతులకు అరుదైన వజ్రాలు దొరికి లక్షలు, కోట్లు సంపాదించారు. తాజాగా ఏపిలో ఓ వ్యక్తికి అరుదైన వజ్రం లభించింది. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లాలో వర్షాలు ప్రారంభం అయ్యాయి.. దీంతో స్థానిక గ్రామస్థులతో పాటు కొంతమంది వ్యక్తులు పొలాల్లో వజ్రాల వేట కొనసాగిస్తున్నారు. అదృష్టం కలిసి వస్తే.. లక్ష్మీదేవి వజ్రాల రూపంలో ఇంటి తలుపు తడుతుందని ఇక్కడ ప్రజలు భావిస్తుంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి పొలాల్లో ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తికి అరుదైన తేనె రంగు వజ్రం లభించిందని.. వెంటనే ఆ వజ్రాన్ని స్థానిక వ్యాపారి రూ.25 లక్షలకు కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అదే రోజు మరో రెండు తెల్లరంగు వజ్రాలు దొరికినట్లు తెలుస్తుంది. ఈ వజ్రాలు మద్దికెర మండలం లోని మదనంతపురానికి చెందిన ఓ వ్యక్తి పొలంలో కలుపు తీస్తుండగా లభ్యమైనట్లు ప్రచారం కొనసాగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ జిల్లాలలో ప్రజలకు అదృష్టాన్ని పరీక్షించుకునే సీజన్. తొలకరి వర్షం పడితే చాటు ప్రతి ఒక్కరూ ఒక్క వజ్రం దొరికినా చాలు జీవితం సెటిలైనట్లే అనే ఆశతో వజ్రాల గాలింపు ని మొదలు పెట్టారు. ఇక్కడ వర్షాలు పడితే వివిధ జిల్లాల నుంచి వ్యవసాయ కూలీలు, గొర్రెల కాపరులు, రైతులు తమ పనులను పక్కనబెట్టి వజ్రాలు గాలించే పనిలో ఉంటారు.. అయితే చాలా మందికి వజ్రాలు దొరికి లక్షాధికారులు అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పొలాల్లో అరుదైన రంగు రాళ్లు దొరికితే చాలు పరుగున వజ్రాల వ్యాపారుల దగ్గరకు వెళ్తారు. అరుదైన రంగురాళ్లు అంటే వజ్రాలను కొనేందుకు అక్కడ వ్యాపారుల మధ్య కూడా పోటీ ఉంటుంది. కర్నూల్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ బంగారు నిక్షేపాలు ఉన్నాయని ఇక్కడి ప్రజలు అంటున్నారు. తొలకరి వర్షం పడితే జనాలు పొలాల్లో వాలిపోతున్నారు.