Farming: మన కడుపు నింపే ప్రతి మెతుకు వెనుక రైతన్నల అకుంటిత శ్రమ ఉంది. ఎండనకా, వాననకా.. రేయనకా.. పగలనకా.. కష్టపడ్డ రైతుల చెమట కష్టం ఉంది. ఇది కాకపోతే ఇంకో పని అనుకునే ప్రసక్తి లేదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఓ రైతుకు తెలిసిన పని ఒకటే.. వ్యవసాయం. తనను తాను ఇబ్బంది పెట్టుకున్నా.. కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసినా.. తాను పసిడి పంట పండించాలని అనుకుంటాడు. నిత్యం దాని గురించే పరితపిస్తాడు. వ్యవసాయ అవసరాలకోసం డబ్బులు లేకపోతే అప్పు తెచ్చుకుంటాడు. అప్పుకూడా దొరకని పరిస్థితుల్లో కుటుంబాన్నే ఆ అవసరాలు తీర్చే యంత్రాలుగా మలుచుకుంటాడు.
ఓ రైతు ఎద్దులతో.. ట్రాక్టర్తో సేధ్యం చేయించే ఆర్థిక స్థోమత లేక తనను తానో లేక పిల్లలనో కాడెద్దులుగా మార్చిన సంఘటనలు చాలానే జరిగాయి.. జరుగుతున్నాయి. తాజాగా, ఓ వ్యక్తి తన చిన్న పిల్లల్ని కాడెద్దులుగా మార్చాడు. కుమారులతో సేధ్యం చేశాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం రంగాపురానికి చెందిన ఈరన్న అనే రైతు ఒక ఎకరం పత్తి, మరో ఎకరంలో చెవుల కాయలు సాగుచేస్తున్నాడు. మొలక దశలో ఉన్న పంటసాళ్ల మధ్యలో గడ్డి మొలిచింది. కలుపు తొలగించేందుకు డబ్బులు లేవు. అప్పటికే పంట వేయటానికి 10 వేలకు పైగా ఖర్చయింది.
ఇక కలుపు తీయటానికి డబ్బులు పెట్టే స్తోమత లేకపోయింది. దీంతో తన ఇద్దరు కుమారుల్ని కాడెద్దులుగా మార్చాడు. భార్య అంజనమ్మతో కలిసి గుంటుక వేశాడు. పంట సాళ్ల మధ్యలో ఉన్న కలుపును తొలగించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వేసవి సెలవుల్లో ఆడుకుంటూ అల్లరి చేయాల్సిన పిల్లలు కాడెద్దులుగా మారి తల్లిదండ్రులకు పొలం పనుల్లో సాయం చేస్తుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రైతు కష్టాలు తెలిసిన వారిని కన్నీళ్లు పెట్టిస్తోంది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : కొడుకును అంగన్వాడిలో చేర్పించిన కలెక్టర్… హ్యట్సాఫ్ అంటున్న నెటిజన్లు!