పింఛన్ల పంపిణీ సమయంలో వృద్ధులకు ఏర్పడే పలు సమస్యలకు చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకీ జగన్ సర్కారు తీసుకున్న ఆ నిర్ణయం ఏంటంటే..!
పింఛన్ల పంపిణీ సమయంలో వచ్చే సమస్యల్లో వేలిముద్రలు పడకపోవడం ఒకటి. వృద్ధులకు వేలిముద్రలు పడకపోవడంతో పింఛన్ పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీని వల్ల కొన్ని సందర్భాల్లో సమయం వృథా అవుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులకు ఆధార్ అనుసంధానంతో లబ్ధిదారుడి ఫేస్ను యాప్లో సరిపోల్చుకుని పెన్షన్ పంపిణీ చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. మార్చి 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని అమలు చేయనుంది. ఇకపై ఫేస్ రికగ్నిషన్తో పాటు వేలిముద్రల విధానం, ఇతర పద్ధతులు కూడా కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది.
కాగా, ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి వృద్ధాప్య పింఛన్ను పెంచింది ఏపీ ప్రభుత్వం. సామాజిక పెన్షన్లను రూ.2,750కి పెంచింది. రూ.250 పెంచి రూ.2,750ను లబ్ధిదారులకు అందిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తంగా 64.74 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నట్లు సర్కారు తెలిపింది. దీంతో పెన్షన్ల కోసం ప్రతి నెలా అందిస్తున్న మొత్తం రూ.1,786 కోట్లకు చేరింది. వచ్చే ఏడాది జనవరి నుంచి రూ.3,000 పింఛన్ అందిస్తామని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎన్నికల హామీ కూడా నెరవేరినట్లు అవుతుందని భావిస్తున్నారట. ఇక, ఇవాళ రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల అకౌంట్లలోకి రిలీజ్ చేశారు. ఈ సంవత్సరం మూడో విడతగా 51.12 లక్షల మందికి రూ.1,090.76 కోట్ల నిధులను రిలీజ్ చేశారు.