మీ దగ్గర రూ. 3 లక్షలు ఉంటే రెండు రోజుల్లో ఎంత సంపాదిస్తారు. మహా అయితే నూటికి 2 రూపాయల వడ్డీకి తిప్పుకుని రూ. 12 వేలు సంపాదిస్తారు. కొంతమంది అయితే ఏకంగా రూ. 10 వడ్డీకి తిప్పుకుంటారు. అలా తిప్పుకున్నా గానీ రెండు రోజులకు 60 వేలు మాత్రమే సంపాదించగలరు. దీన్ని వ్యాపారం అనండి, దోపిడీ అనండి, ఇంకేమైనా అనండి. కానీ రెండు రోజుల్లో రూ. 30 లక్షలు సంపాదించడం సాధారణ మనుషుల వల్ల అవుతుందా? కానీ ఓ గ్యాంగ్ రూ. 3 లక్షలు పెట్టుబడి పెట్టి రెండు రోజుల్లో రూ. 30 లక్షలు సంపాదించారు. ఏం చేస్తే అంత డబ్బు వచ్చిందని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
మూడు లక్షలు పెట్టుబడి పెట్టి రెండే రెండు రోజుల్లో 30 లక్షలు సంపాదించారు. వ్యాపారం చేసి సంపాదించింది కాదు, భక్తులను దోచుకుని సంపాదించిన సొమ్ము. ఈ భూమ్మీద మనుషులను మోసం చేయడానికి అనేక దార్లు ఉన్నాయి. వాటిలో జూదం ఒకటి. ఆలయంలో స్వామి వారిని దర్శించుకునే భక్తులే టార్గెట్ గా కొంతమంది గ్యాంబ్లింగ్ నిర్వాహకులు భక్తుల నుంచి ఏకంగా రూ. 30 లక్షలు దోచుకున్నారు. రూపాయికి పది, పదికి వంద రూపాయలు వస్తాయని ఆశ చూపించి వారి జేబులను గుల్ల చేశారు. పండగ పూట దేవుడ్ని దర్శించుకుని సరదాగా ఉందామనుకున్న భక్తులకు డబ్బు ఆశ చూపించి దొరికినకాడికి దోచేశారు.
కర్నూలు జిల్లా గడివేములలోని దుర్గాభోగేశ్వర క్షేత్రంలో జరిగిన శివరాత్రి మహోత్సవాలకు వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరిగి వెళ్లే క్రమంలో భక్తులను ప్రలోభ పెట్టేందుకు గ్యాంబ్లింగ్ నిర్వాహకులు జూద క్రీడలు నిర్వహించారు. కాయ్ రాజా కాయ్ ఆట పేరుతో భక్తులను ప్రలోభపెట్టి దొరికినంత దోచుకున్నారు. పదుల సంఖ్యలో టేబుళ్లు ఏర్పాటు చేసి బహిరంగంగా కాయ్ రాజా కాయ్ ఆట నిర్వహించి భారీగా దోచుకున్నారు. దీని కోసం మూడు లక్షలు పెట్టుబడి పెట్టారు. భక్తుల దగ్గర డబ్బులు అయిపోతే ఇంటికెళ్లి తెచ్చుకుని మరీ ఆడేంతగా వాళ్ళని ప్రభావితం చేశారు. చిన్నపిల్లలు, యువకులు, పెద్దలు అని తేడా లేకుండా అన్ని వయసుల వారు ఈ ఆట ఆడి డబ్బులు పోగొట్టుకున్నారు.
వేల రూపాయల్లో డబ్బులు పోగొట్టుకున్న భక్తులు తప్పు చేశామే అని బాధపడుతున్నారు. ఇలాంటి ఆటలకు అనుమతి లేకపోయినా ఎలా ఆడారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మధ్యతరగతి బతుకులు.. రూపాయి పెడితే నాలుగు రూపాయలు వస్తాయని ఆశపడడం సహజం. దాన్ని అలుసుగా తీసుకుని కొంతమంది దుర్మార్గులు ఇలా మోసాలకు పాల్పడుతున్నారు. చివరకి ఎలా అయిపోయిందంటే.. ఆశపడడం, కల కనడం కూడా నేరమేమో అని పేద, మధ్యతరగతోళ్లు బాధపడే పరిస్థితికి తీసుకొచ్చేసారు. మరి భక్తులను ప్రలోభపెట్టి రూ. 3 లక్షల పెట్టుబడితో రెండు రోజుల్లో 30 లక్షలు దోచుకున్న ఈ గ్యాంబ్లర్స్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.