కరోనా తరువాత అన్నీ రంగాల్లో వరుస మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. సినీ, రాజకీయ రంగాలు కూడా ఇందుకు అతీతం కాదు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. తాజాగా ఏపీలోని అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట కూడా ఇలాంటి ఓ విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
వైసీపీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పరిచయం అవసరం లేదు. ఈయన కేవలం చంద్రగిరి ఎమ్మెల్యే మాత్రమే కాదు, ఏపీ ప్రభుత్వ విప్ కూడా. అయితే.. తాజాగా ఎమ్మెల్యే చెవిరెడ్డి తండ్రి.. చెవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి తుదిశ్వాస విడిచారు. ఈయన గత కొంత కాలంగా శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పలుమార్లు ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందించినా చెవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి ఆరోగ్యం కుదటపడలేదు. ఇక సోమవారం రాత్రి హఠాత్తుగా ఊపిరి పీల్చడంలో ఇబ్బంది కలగడంతో కుటుంబ సభ్యలు కలవరపాటుకి గురయ్యారు. కుటుంబ సభ్యలు, బంధువులు ఆయన్ని వెంటనే స్విమ్స్ కు తరలించారు.
ఆస్పత్రికి చేరుకునే సమయానికే చెవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో.. డాక్టర్స్ ఎంత ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక చివరికి మణి రెడ్డి మృతి చెందినట్లు స్విమ్స్ వైద్యులు వెల్లడించారు. చెవిరెడ్డి తండ్రి సుబ్రహ్మణ్యం రెడ్డి మరణంపై అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు తమ సంతాపాన్ని తెలియజేశారు. ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డికి చెవిరెడ్డి అత్యంత ఆప్తుడు కాబట్టి.. జగన్ కూడా ఆయన్ని పరామర్శించబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇక సుబ్రహ్మణ్యరెడ్డి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో పీసీసీ కార్యదర్శిగా పనిచేశారు. తరువాత కాలంలో ఆయన రాజకీయ వారసత్వాన్ని చెవిరెడ్డి కొనసాగిస్తుండటం విశేషం.