ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం తేల్చి చెప్పేసింది. ప్రత్యేక హోదా అంశం అసలు ఉనికిలోనే లేదని కేంద్రం స్పష్టం చేసింది. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న క్రమంలో వైసీపీ నాయకులు ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ సందర్భంగా కేంద్రం.. ప్రత్యేక హోదా అంశం ఉనికిలోనే లేదని వెల్లడించింది. ఇవాళ డిసెంబర్ 12న జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది. కేంద్ర ప్రణాళిక మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ లిఖిత పూర్వకంగా సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. గతంలో జాతీయ అభివృద్ధి మండలి వివిధ కారణాలు, ప్రత్యేక పరిస్థితుల రీత్యా కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చిందని.. అయితే 14వ ఆర్థిక సంఘం జనరల్ కేటగిరి రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీకి ఎలాంటి వ్యత్యాసం చూపలేదని పేర్కొన్నారు.
ప్రణాళిక, ప్రణాళికేతర కింద ఇరు రాష్ట్రాల అవసరాల మేరకు నిధుల బదలాయింపుకు.. 14వ ఆర్థిక సంఘం అనేక అంశాలను పరిగణలోకి తీసుకుందని పేర్కొన్నారు. ఆర్థిక సంఘం సిఫార్సులతో కేంద్రం రాష్ట్రాలకు 2015-2020 మధ్య పన్నుల వాటాను 32 నుంచి 42 శాతానికి పెంచామని వెల్లడించారు. 15వ ఆర్ధిక సంఘం కూడా 41 శాతం పన్నుల వాటాకు సిఫార్సు చేసిందని తెలిపారు. నిధుల పంపిణీ తర్వాత కూడా వనరుల లోటు ఉన్న రాష్టాలకు ఆ వనరులను అందించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. వనరుల లోటు ఉన్న రాష్ట్రాలకు రెవెన్యూ లోటు గ్రాంట్స్ అందిస్తున్నామని కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ లిఖిత పూర్వకంగా సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మరి ప్రత్యేక హోదా అంశం ఉనికిలోనే లేదని తేల్చి చెప్పేసిన కేంద్రంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.