KonaSeema District: యానాం సముద్ర మార్గంలో పడవ చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారులు అనుకోకుండా పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నారు. తీవ్ర గాలుల దాటికి ఆ పడవ బోల్తా పడింది. చుట్టూ ఎవరూ లేరు. బోల్తా పడ్డ పడవ మీద ఎక్కి ప్రాణ భయంతో తమని రక్షించమని కేకలు వేశారు. అదృష్టం కొద్దీ వాళ్ళు పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారు. ఈ ఘటన కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ పరిధిలో ఉప్పలగుప్తం మండలంలో చోటు చేసుకుంది. కాకినాడకు చెందిన 15 మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్తుండగా పడవ బోల్తా పడింది. ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం వద్ద ఒక్కసారిగా గాలులు తీవ్రత పెరగడంతో పడవ అదుపుతప్పి బోల్తా పడింది. పడవ బోల్తా పడడంతో మత్స్యకారులు తిరగబడ్డ పడవపైకి ఎక్కి తమని రక్షించాలని కేకలు వేశారు. కాసేపటికి చేపల వేట సాగిస్తూ అటుగా మరో పడవలో వచ్చిన కొంతమంది ఇది గమనించారు. ప్రమాదంలో ఉన్నట్టు గుర్తించి మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఉప్పలగుప్తం మండలంలో ఉన్న ఓఎన్జిసి హెలికాప్టర్లో మెరైన్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. హెలికాప్టర్ సాయంతో మత్స్యకారులను అక్కడి నుండి కాకినాడ హార్బర్కు సురక్షితంగా తరలించారు. సకాలంలో పోలీసులు స్పందించి రక్షించడంతో 15 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మరి మెరైన్ పోలీసుల స్పందించిన తీరుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.