పోలీసు అభ్యర్థులకు అలర్ట్. ఈవెంట్స్ నిర్వహణ విషయంలో పోలీసు నియామక బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డు నిర్ణయం ఏంటంటే..!
ఆంధ్రప్రదేశ్లో 6,100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నియామక ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష కూడా ఇప్పటికే పూర్తయింది. కాగా, ఫిజికల్ ఈవెంట్స్ను ఈ నెల 14 నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే.. ఈ ఈవెంట్స్ను పోస్ట్పోన్ చేస్తూ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈవెంట్స్ను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు బోర్డును కోరారు. దీంతో ఈ నిర్ణయం తీసుకుంది రిక్రూట్మెంట్ బోర్డు. కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని పోలీసు బోర్డు తెలిపింది.
ఇక, ఏపీలో ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలను ఫిబ్రవరి 5న విడుదల చేసింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. రాత పరీక్షకు మొత్తం 4,59,182 మంది అభ్యర్థులు హాజరు కాగా.. వీరిలో 95,208 మంది అభ్యర్థులు (20.73 శాతం) ఫిజికల్ ఈవెంట్స్కు అర్హత సాధించారు. ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించిన వారికి స్టేజ్-2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 13 నుంచి 20 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకున్న వారికి మార్చి 13 నుంచి ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించాల్సి ఉంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు పరీక్షలను వాయిదా వేయాలని కోరడంతో బోర్డు పరీక్షలను పోస్ట్పోన్ చేసింది.