గత నెల నుంచి టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్యులు కొనే పరిస్థితి కనబడడం లేదు. దీంతో ప్రభుత్వం రైతులు, వ్యాపారుల నుంచి మార్కెట్లో టమాటాలు కొనుగోలు చేసి నష్టమైనా గానీ రైతు బజార్ల ద్వారా కిలో రూ. 50కే విక్రయిస్తోంది. ప్రస్తుతం ఏ ఏ జిల్లాల్లో విక్రయిస్తుందంటే?
డిమాండ్ కి తగ్గట్టు సప్లై లేకపోవడంతో టమాటా ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రూ. 125 నుంచి రూ. 150 మధ్య కొనసాగుతుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐతే కిలో టమాటా రూ. 250 దాటింది. అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి టమాటా ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం రైతుబజార్ల ద్వారా సగం కంటే తక్కువ ధరకే టమాటాలను విక్రయిస్తోంది. కిలో రూ. 150 ఉన్న టమాటాలు రైతుల వద్ద కొనుగోలు చేసి నష్టమైనా గానీ రూ. 50కే విక్రయిస్తోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా మార్కెట్లో జోక్యం చేసుకుని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద రైతుల వద్ద గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి కిలో టమాటా రూ. 50కే సబ్సిడీపై అందిస్తుంది.
గత నెల 28 నుంచి కిలో రూ. 50 చొప్పున విక్రయిస్తుంది. ధరలు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకూ రైతు బజార్లలో కిలో రూ. 50కే టమాటాలు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి రోజూ రాష్ట్రంలోని వివిధ టమాటా మార్కెట్ల నుంచి, పొరుగు రాష్ట్రాల మార్కెట్ల నుంచి టమాటాలను సేకరించి సబ్సిడీపై అందిస్తున్నారు. ఇప్పటి వరకూ దాదాపు రూ. 4 కోట్లు ఖర్చు పెట్టి 422.06 టన్నుల టమాటాలు సేకరించింది ప్రభుత్వం. ప్రధాన మార్కెట్లలో ప్రభుత్వం కూడా వేలంపాటలో పాల్గొని రైతుల నుంచి, వ్యాపారుల నుంచి టమాటాలను సేకరిస్తుంది. సగటున కనిష్టంగా కిలో రూ. 94.44 నుంచి గరిష్టంగా రూ. 110 చొప్పున కొనుగోలు చేసి సగం ధర కంటే తక్కువ రేటుకే విక్రయిస్తోంది. శుక్రవారం కిలో రూ. 94.34 చొప్పున 65 టన్నుల టమాటాలు రూ. 61.32 లక్షలు ఖర్చు చేసి ఏపీ మార్కెటింగ్ శాఖ అధికారులు సేకరించారు.
వీటిలో పలమనేరు మార్కెట్ నుంచి 30 టన్నులు, మదనపల్లి మార్కెట్ నుంచి 20 టన్నులు, విజయవాడలోని రైతులు, వ్యాపారుల నుంచి 15 టన్నులు సేకరించారు. మొన్నటి వరకూ కడప, కర్నూలు జిల్లాల్లో 50 రూపాయలకే టమాటాలు అందించిన రాష్ట్ర ప్రభుత్వం.. విశాఖపట్నం, తూర్పుగోదావరి, కాకినాడ, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కూడా విక్రయిస్తోంది. వివిధ మార్కెట్లు, రైతులు, వ్యాపారుల నుంచి సేకరించి ఈ జిల్లాల్లోని రైతు బజార్లకు తరలించి ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 103 రైతు బజార్లలో ఒక్కో మనిషికి కిలో నుంచి రెండు కిలోల టమాటాలను విక్రయిస్తోంది. ప్రభుత్వంపై ఆర్థిక భారం అయినప్పటికీ సగటున కిలో రూ. 94.44 చొప్పున కొనుగోలు చేసి ప్రజలకు రూ. 50కే విక్రయిస్తున్నామని.. ధరలు తగ్గే వరకూ రైతు బజార్లలో సబ్సిడీ టమాటా కౌంటర్లు కొనసాగిస్తామని ఏపీ మార్కెటింగ్ శాఖ కమిషనర్ రాహుల్ పాండే అన్నారు.