ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని విజయవాడ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానంలో తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. జలుబు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతున్న గవర్నర్కు ఈ నెల 15న పరీక్షలు నిర్వహించగా కొవిడ్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో 17న అత్యవసరంగా హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకోవడంతో 23న డిశ్చార్జ్ చేశారు.
ఆదివారం రాత్రి మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో గవర్నర్ మళ్లీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చి ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కాగా గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా.. గవర్నర్కు కరోనా సోకింది. కొవిడ్ తగ్గుముఖం పడుతున్నప్పటికీ అశ్రద్ధగా ఉండవద్దని ప్రజలకు వైద్యులు సూచిస్తున్నారు.
ఇక ఒడిశాకు చెందిన బిశ్వభూషణ్ 2019 జూలై నుంచి ఏపీ గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 88 ఏళ్లు. 1971లో జన సంఘ్లో చేరిన బిశ్వభూషణ్.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004-09 మధ్య ఒడిశా మంత్రిగానూ పని చేశారు.