ఆరోగ్యశ్రీ పరిధిని మరితం విస్తృతం చేస్తూ ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరో 809 చికిత్సలను చేరుస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పుడు తాజాగా పెంచిన 809 చికిత్సలతో కలిపి ఆరోగ్యశ్రీ పథకం కింద మొత్తం 3,255 చికిత్సలు అందిస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే వైసీపీ ప్రభుత్వంలో 2,196 వైద్య చికిత్సలను అదనంగా చేర్చినట్లు వివరించారు. శుక్రవారం జరిపిన వైద్యారోగ్య శాఖ రివ్యూలో సీఎం జగన్ ఈ నూతన చికిత్సలను అమలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ పథకం అమలుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
ఆరోగ్యశ్రీ పథకం గురించి సీఎం జగన్ మాట్లాడుతూ.. “టీడీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కింద కేవలం 1,059 చికిత్సలు మాత్రమే అందిచేవారు. వాటిని మా ప్రభుత్వంలో 3,255కు పెంచాం. వైద్యానికి రూ.వెయ్యికన్నా ఎక్కువ ఖర్చయ్యే ప్రతి చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాం. మే 2019 నాటికి ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సల సంఖ్య 1,059గా ఉండేది. వాటిని జనవరి 2020లో 2,059కి, జులై 2020లో 2,200, నవంబర్ 2020లో 2,436, జూన్ 2021లో 2,446కు, ఇప్పుడు తాజాగా ఆ సంఖ్యను 3,255కు పెంచాం. చంద్రబాబు హయాంలో 2018–19 నాటికి ఆరోగ్యశ్రీ, 104, 108పై మొత్తంగా రూ.1299.01 కోట్లు ఖర్చు చేశారు. టీడీపీ ప్రభుత్వం కన్నా మూడు రెట్లు అధికంగా ఖర్చు చేస్తున్నాం. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో పెంచిన వైద్య చికిత్సల కారణంగా ఏడాదికయ్యే ఖర్చు రూ.2,894.87 కోట్లుగా ఉంది” అని వివరించారు.