గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఏపీలో ఎంట్రీ ఇచ్చిన అదానీ గ్రూప్.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత దూకుడుగా అడుగులేసింది. తాజాగా ఏపీ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలే అందుకు నిదర్శనం.
గత కొన్ని రోజుల నుంచి దేశమంతటా అదానీ సంస్థ పేరు మారుమోగిపోతుంది. రెండు రోజుల క్రితం కూడా ఈ సంస్థ గురించి పార్లమెంట్ లో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా సాగిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఆదానీ సంస్థ మరోసారి వార్తల్లో నిలిచింది. అదానీ గ్రూప్ సంస్థలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 500 ఎకరాల స్థలం కేటాయించింది. తాజాగా జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అదానీ గ్రూప్ కు చెందిన పలు సంస్థలు రాష్ట్రంలో పాగా వేశాయి. ఆ సంస్థలకు ప్రభుత్వం భూముల కేటాయింపు కూడా చేసింది. తాజాగా అదానీ సంస్థలకు మరోసారి భూములు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియా సమావేశంలో వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టులో రెండు క్యాప్టివ్ బెర్తుల నిర్మాణానికి జేఎస్ డబ్ల్యూ లిమిటెడ్ కు 250 ఎకరాల్ని లీజు ప్రాతిపదికన రాష్ట్ర కేబినెట్ కేటాయిచింది. వైజాగ్ లో అదానీ సంస్థ ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్, ఐటీ, బిజినెస్ పార్క్, స్కిల్ రిక్రియేషన్ సెంటర్ల ఏర్పాటు కోసం 60 ఎకరాలను భూమిని వీటీపీఎల్ కేటాయించింది. అనంతపురం జిల్లాలో అదానీ గ్రీన్ ఎనర్జీ ఏర్పాటు చేసే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు కోసం మరో 406 ఎకరాలను, ఎకరం రూ.5 లక్షల చొప్పున కేటాయించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇంకా ఈ కేబినెట్ సమావేశంలో మరికొన్ని కీలక అంశాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిసింది. వీటి ద్వారా రూ.1.20 లక్షల కోట్ల పెట్టుబడులతో, 70 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడి. నెల్లూరు బ్యారెజ్ పేరును నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి నెల్లూరు బ్యారెజ్ గా నామకరణం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కర్నూలులో 50 ఎకరాల్లో రెండో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నారు.
అదాని సంస్థల విషయంలో ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. కొన్ని రోజుల క్రితం హిండెన్ బర్గ్ నివేదిక అదానీ గ్రూప్ పై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే. ఆసమయంలో అదానీ షేర్ల విలువలు కూడా అమాతం పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాల్ని సమీక్షిస్తుందా?, స్థలాల కేటాయింపులు రద్దు చేస్తుందా? అని అందరిలో ఓ సందేహం నెలకొంది. ఇలాంటి సమయంలో అనూహ్యంగా రెండు చోట్ల కొత్తగా అదానీ గ్రూప్ సంస్ధలకు భూములు కేటాయిస్తూ జగన్ సర్కార్ పై నిర్ణయం తీసుకుంది. మరి.. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి