ఓ 10-15 ఏళ్ల క్రితం వరకు అందాల పోటీలు అంటే.. కేవలం నార్త్ ఇండియన్స్ అన్నట్లుండేవి పరిస్థితులు. ప్రస్తుతం మన తెలుగమ్మాయిలు కూడా అందాల పోటీల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఏపీకి చెందిన యువతి మిస్ ఇండియా పోటీలకు ఎన్నికైంది. ఆ వివరాలు..
అందం ఈ మాటకు ఎవరు సరైన నిర్వచనం చెప్పలేరు. అందానికి ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కోరకమైన అభిప్రాయం ఉంటుంది. కొందరు పైకి కనిపించే రూపం అందంగా ఉండాలని భావిస్తారు. మరి కొందరు మానసిక సౌందర్యం ముఖ్యం అనుకుంటారు. స్వచ్ఛమైన చిరునవ్వు.. ఆత్మవిశ్వాసమే అసలైన సౌందర్యం అంటారు కొందరు. మనుషుల ఆలోచనలు బట్టి అందానికి నిర్వచనం మారుతూ ఉంటుంది. ప్రతి మనిషికి అందం గురించి కాస్తో కూస్తో శ్రద్ధ ఉంటుంది. ఇక మోడలింగ్, సినీ రంగాల్లో ఉండే వారికి అందమే ఆయుధం. వారి అందం ఏమాత్రం చెక్కు చెదిరిన.. ఇక కెరీర్ ముగిసినట్లే అని భావిస్తారు. ఇక గ్లామర్ ఫీల్డ్లో అందాల పోటీలకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మిస్ ఇండియా, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ వంటి పోటీల్లో పాల్గొనేందుకు అమ్మాయిలు తెగ ఆసక్తి చూపుతారు. ఒకప్పుడు ఈ అందాల పోటీలు అనగానే ఎక్కువగా నార్త్ వాళ్లే గుర్తుకు వచ్చేవారు. వారే కిరీటం దక్కించుకునే వారు.
అయితే మారుతున్న కాలంతో పాటు సమాజంలో పరిస్థితులు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు సినిమాలు, మోడలింగ్, అందాల పోటీలు అంటే మన తెలుగమ్మాయిలు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. కానీ కొన్నేళ్లుగా పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రస్తుతం తెలుగు అమ్మాయిలు గ్లామర్ ఫీల్డ్లో కూడా రాణిస్తున్నారు. ఇక కొన్నాళ్ల క్రితం తెలుగమ్మాయి శోభిత ధూలిపాళ్ల మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న సంగతి తెలసిందే. ఆ తర్వాత ఆమె సినిమాల్లో రాణిస్తుంది. వైజాగ్ వివాహిత మిసెస్ ఇండియా పోటీలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో తెలుగు యువతి.. మిస్ ఇండియా పోటీలకు సెలక్ట్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ రైతు బిడ్డ ఈ అరుదైన ఘనత సాధించింది. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్, అన్నమయ్య జిల్లా, ఓబులవారిపల్లె మండలంలోని ముక్కావారిపల్లె గ్రామానికి చెందిన ముక్కా గోమతిరెడ్డి ఈ ఏడాది మార్చి 5న ముంబైలో నిర్వహించనున్న ఫెమీనా మిస్ ఇండియా పోటీలకు ఎంపికైంది. గోమతి తండ్రి శ్రీనివాసులరెడ్డి, తల్లి అరుణకుమారి. వీరిది వ్యవసాయ కుటుంబం. గోమతి ఒక్కతే సంతానం. ఇక పాఠశాలలో చదువుతున్నప్పటి నుంచే గోమతి బెస్ట్ బేబి వంటి పోటీల్లో పాల్గొని.. తన టాలెంట్తో అందరిని మెప్పించేది. కుమార్తె ఆసక్తిని గమనించిన గోమతి తల్లిదండ్రులు ఆమెను ఆ దిశగా ప్రోత్సాహించారు. కుమార్తెకు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో గోమతి డిగ్రీ చదువుతుండగా.. కాలేజీలో నిర్వహించిన అందాల పోటీల్లో పాల్గొని విజయం సాధించింది.
ఆ తర్వాత బెంగళూరులో నిర్వహించిన సౌత్ ఇండియన్ మిస్ ఫెమీనా పోటీల్లో పాల్గొని రన్నరప్గా నిలిచింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 25న ముంబైలో నిర్వహించిన ఫెమినా మిస్ ఆంధ్రా పోటీల్లో పాల్గొని టైటిల్ గెలుచుకుంది గోమతి. దాంతో మిస్ ఇండియా పోటీల్లో ఏపీ తరఫున పాల్గొనే అవకాశం దక్కించుకుంది. మార్చి 5న జరిగే మిస్ ఇండియా పోటీల్లో ఏపీ తరఫున పాల్గొననుంది గోమతి. మిస్ ఇండియా కిరీటం గెలిచి.. ఆ తర్వాత మిస్ వరల్డ్ కిరీటం సాధించడమే తన లక్ష్యం అంటుంది గోమతి.
మరి అందాల పోటీల్లో పడి చదువును అశ్రద్ధ చేసిందా అంటే లేదు. ప్రస్తుతం గోమతి బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో డెవలపర్గా ఉద్యోగం చేస్తోంది. ఇక తల్లిదండ్రుల సహకారంతోనే తాను ఇంత దూరం రాగలిగానని.. వారు మద్దతు ఉంటే.. జీవితంలో ఏదైనా సాధించవచ్చనే ధైర్యం కలుగుతుందని చెప్పింది. మిస్ వరల్డ్ కిరీటం సాధించడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చింది. మరి గోమతి సాధించిన విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.