తిరుపతిలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు లక్షలాది మంది ప్రజలు రోజు తిరుమలకు వస్తుంటారు. కొందరు బస్సులు, సొంత వాహనాల ద్వారా కొండ మీదకు వెళ్లి దేవ దేవుణ్ణి కొలుస్తారు.
తిరుపతిలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు లక్షలాది మంది ప్రజలు రోజూ తిరుమలకు వస్తుంటారు. కొందరు బస్సులు, సొంత వాహనాల ద్వారా కొండ మీదకు వెళ్లి దేవ దేవుణ్ణి కొలుస్తారు. మరికొందరు.. నడక మార్గంలో వెళ్లి దర్శించుకుంటారు. అయితే ఈ నడక మార్గం చుట్టూ అడవి ఉండటం వల్ల వన్య మృగాలు తిరుగాడుతూ ఉంటాయి. అవి ఒక్కోసారి ప్రజలపై దాడి చేస్తున్నాయి. దీంతో నడక మార్గంలో ప్రయాణించాలంటే భయపడిపోతున్నారు భక్తులు. ఇటీవల అలిపిరి మార్గంలో మూడేళ్ల చిన్నారిపై చిరుత దాడి చేసిన సంగతి విదితమే. అయితే అక్కడున్న సిబ్బంది స్పందించి బాబును సమీపంలోని ఆసుపత్రికి తరలించడంతో చిన్నారికి ప్రాణపాయం తప్పింది.
ఈ ఘటనపై అప్రమత్తమైన అధికారులు చిరుత పులి కోసం వేట మొదలు పెట్టారు. 7వ మైలురాయి వద్ద బోను ఏర్పాటు చేయగా.. అందులో చిక్కింది. అయితే ఇది పిల్లగా తేలింది. ఇదే బాలుడిపై దాడి చేసిందని అధికారులు భావిస్తున్నారు. దీనికి ఏడాదిన్నర వయస్సు ఉంటుందని తెలిపారు. చిక్కిన చిరుతను అడవిలో వదిలేస్తామని టీటీడీ డీఎఫ్వో శ్రీనివాసులు తెలిపారు. అయితే ఇదే ప్రాంతంలో మరో చిరుత ఉండే అవకాశాలున్నాయని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. చిరుత తల్లి ఈ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉండవచ్చుని, ట్రాప్ చేసేందుకు నడక మార్గంలో ప్రయత్నాలు ముమ్మురం చేశారు. గాలిగోపురం నుండి నరసింహ స్వామి ఆలయం వరకు 6 కిలోమీటర్ల వరకు దానిపై నిఘా పెట్టి ఉంచారు. నడకదారి చుట్టూ కంచె, గోడ నిర్మించడం కుదరదని.. అయితే ఈ ఆపరేషన్ కొనసాగించాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆదేశించారు.