ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి.. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. అధికార పార్టీ పలు తాము అమలు చేసిన పథకాల గురించి విశ్లేషిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రభుత్వం అటు ప్రభుత్వ ఉద్యోగులు ఇటు సామాన్య ప్రజల మద్దతు పొందేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో నేడు సీఎం జగన్ అధ్యక్షతన ఏపి కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో 63 అంశాలకు ఆమోద ముద్ర కూడా వేశారు. అంతేకాదు గత కొంతకాలంగా హాట్ టాపిక్ గా నిలుస్తున్న సీపీఎస్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
నేడు ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత కొంతకాలంగా సీపీఎస్ రద్దు విషయంలో చర్చలు కొనసాగుతూ వచ్చాయి. మొత్తానికి ఆలస్యంగా అయినా సరే సీఎం జగన్ ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకన్నారు. సీపీఎస్ ని రద్దు చేసి.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించారు. ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు – 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలుకు సైతం శ్రీకారం చుట్టారు. అదేవిధంగా పదివేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కేబినెట్ ఆమోద ముద్ద వేసింది. 12వ పీఆర్సీ ఏర్పాటుకు కెబినెట్ ఆమోదం తెలియజేసింది. అంతేకాదు జిల్లా కేంద్రాల్లో అన్నింటిలోనూ 16 శాతం హెచ్ఆర్ఏ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొత్త డీఏ అమలుకు చర్యలు చేపట్టేందుకు ఆమోదం వ్యక్తం చేశారు.
సీపీఎస్ పెన్షన్ స్కీమ్ (కాంట్రిబ్యూటీరీ పెన్షన్ స్కీమ్). 2003 లో అప్పటి వాజ్ పాయి ప్రభుత్వం ఈ పథకానికి నోటిఫికేషన్ ఇచ్చింది.. ఈ స్కీమ్ 2004 లో అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం అమలు చేసింది. ఈ స్కీమ్ అమలు కాక ముందు ఉద్యోగుల జీతాల నుంచి ఒక్క పైసా కూడా కట్ అయ్యేది కాదు.. కానీ సీపీఎస్ స్కీమ్ వచ్చిన తర్వాత ప్రతి ఉద్యోగి జీతం నుంచి కనీసం 10 శాతం పెన్షన్ స్కీమ్ కోసం కట్ అవుతుంది. ఈ క్రమంలోనే ఉద్యోగులు సీపీఎస్ స్కీమ్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే ఏపిలో గత ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్ ఉద్యోగులకు పలు హామీలు ఇచ్చారు.
ఏపీలో ఉద్యోగుల పెన్షన్ ను సీపీఎస్ విధానంలోకి మారుస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సవరించి తిరిగి వారికి పాత పద్దతిలోకి మారుస్తామని.. సీపీఎస్ రద్దు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లు దాటుతున్నా సీపీఎస్ విషయంపై నిర్ణయం తీసుకోకపోవడంతో ఏపీ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఈ విషయంలో ప్రభుత్వానికి.. ప్రభుత్వ ఉద్యోగులకు మద్య పలుమార్లు చర్చలు జరిగాయి. ఎట్టకేలకు సీఎం జగన్ సీపీఎస్ రద్దు చేశారు. ఆలస్యంగా అయినా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.