ప్రస్తుతం ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలకు 9 నెలల గర్భిణీ హాజరైంది. అయితే పరీక్ష సమయంలో ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి.
చదువంటే కొంతమందికి పిచ్చి ఉంటుంది. ఎంత కష్టం ఉన్నా కూడా ఏడాది మొత్తం బాగా కష్టపడి చదువుతారు. ఆ తర్వాత పరీక్షల్లో తమ సత్తా చాటుతారు. అయితే చదువంటే కేవలం విద్యార్థులు, విద్యార్థినులే కాదు పెళ్ళైన వారు, వయసులో పెద్దవారు కూడా మక్కువ చూపిస్తున్నారు. పెళ్ళై పిల్లలు ఉన్నవారు కూడా పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్షలు రాసి ఉత్తీర్ణులవుతున్నారు. ఒక పక్క పని చేస్తూనే మరో పక్క ఖాళీ సమయంలో చదువుకుంటూ పరీక్షలు రాస్తున్నారు. కొంతమంది ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటారు. ఆ ఉద్యోగానికి కావాల్సిన అర్హత సంపాదించుకోవడం కోసం ప్రైవేట్ గా కట్టి పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు. ఇలా ఆడ, మగ అని తేడా లేకుండా చాలా మంది పరీక్షలు రాసి ఉత్తీర్ణులవుతున్నారు.
ఈ తరహాలోనే ఒక యువతి ఇంటర్ పరీక్షల కోసం బాగా ప్రిపేర్ అయ్యింది. అది కూడా ఆమె గర్భిణీ. గర్భిణీ అయి ఉండి పరీక్షలకు ప్రిపేర్ అవ్వడమే కాకుండా 9వ నెల కడుపుతో ఉండి పరీక్షకు హాజరైంది. కానీ పరీక్ష రాయకుండానే ఆమె పురిటి నొప్పులతో ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం ఏపీలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. మార్చి 15 బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. అయితే పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ విద్యార్థినికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.
కొత్తవలసకు చెందిన ఓ వివాహిత (22) పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాసేందుకు హాజరైంది. అయితే ఆమె 9 నెలల నిండు గర్భిణీ కావడంతో పరీక్ష రాస్తుండగా పురిటి నొప్పులు వచ్చాయి. విషయం తెలుసుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ వెంటనే 108కి కాల్ చేశారు. సకాలంలో అంబులెన్స్ అక్కడకు చేరుకుని ఆ యువతిని పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆమె వెటర్నరీ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. ఇంటర్మీడియట్ అర్హత ఉండాలని చెప్పడంతో ఇంటర్ పరీక్షలు రాసేందుకు పరీక్ష కేంద్రానికి వెళ్ళింది. అయితే పరీక్ష పూర్తవ్వకుండానే ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. ఈ పరీక్షలు తన భార్యకు చాలా ముఖ్యమని, అందుకే నెలలు నిండినా కూడా తన భార్యను పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చానని ఆమె భర్త వెల్లడించారు.