పాకిస్థాన్ క్రికెట్ జట్టు కొద్దిరోజులుగా బాగా వార్తల్లో నిలుస్తోంది. భద్రత దృష్ట్యా న్యూజిలాండ్, ఇంగ్లాండ్ పర్యటనలు రద్దు చేసుకోవడం. న్యూజిల్యాండ్ టీమ్ ఏర్పాటు చేసిన భద్రతా సిబ్బంది రూ.27 లక్షల బిర్యానీ బిల్లు చేయడం ఇలాంటి వార్తలు విన్నాం. ఐసీసీ టీ20 సందర్భంగా రమీజ్ రాజా, అక్తర్ వంటి వారు సవాళ్లు విసరడం చూశాం. తాజాగా పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ జట్టుపై మాజీలు విమర్శలు, అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఆ జాబితాలో షాహిద్ ఆఫ్రిది కూడా చేరాడు.
కెప్టెన్ బాబర్ ఆజామ్ నేతృత్వంలో ఐదుగురు బ్యాట్స్మన్లు, ఇద్దరు కీపర్లు, నలుగురు ఆల్రౌండర్లు, నలుగురు బౌలర్లతో మొత్తం 15 మంది సభ్యుల టీమ్ను ప్రకటించిన విషయం తెలిసిందే. వారిలో కొందరిని ఎంపిక చేయడం పట్ల షాహిద్ ఆఫ్రిది అసహనం వ్యక్తం చేశాడు. ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాదీర్, షాహనవాజ్ దహానిలను రిజర్వ్ ప్లేయర్లుగా తీసుకోవడాన్ని ప్రశ్నించాడు. ‘అసలు కొందిరిని ఎందుకు తీసుకున్నారో.. కొందరిని ఎందుకు తీసుకోలేదో నాకు అర్థం కావడం లేదు’ అని ఆఫ్రీది తెలిపాడు. సెలక్షన్ కమిటీ నిర్ణయాలతో నేను ఏకీభవించడంలేదని ఆఫ్రీదీ స్పష్టం చేశాడు. వరల్డ్ కప్కు ముందే జట్టులో మార్పులు చేస్తారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. జట్టుకు మాత్రం తాను ఎప్పుడూ మద్దతుగానే ఉంటానని చెప్పాడు.
కోచ్ల నియామకంపై కూడా ఆఫ్రిది స్పందించాడు. వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీకి ముందు కోచ్లను మార్చడం ఎందుకని ప్రశ్నించాడు. వరల్డ్ కప్ కసం కోచ్లను మారిస్తే గనుక అదేమీ పెద్దగా ప్రభావం చూపదని తెలిపాడు. టోర్నీ తర్వాత మార్చి ఉండాల్సింది అని అభిప్రాయపడ్డాడు. కొత్త కోచ్లు ఆటగాళ్లను అర్థం చేసుకోవడానికి సమయం పడుతుందని అన్నాడు.