సోమవారం తెల్లవారుజామున దుబాయ్ నుంచి భారత్ వచ్చిన టీమిండియా ఆటగాడు హార్ధిక్ పాండ్యాకు ముంబై ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు షాక్ ఇచ్చారు. పన్నులు కట్టకుండా ఖరీదైన వాచ్ తీసుకొచ్చినట్లు గుర్తించి, వాచ్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా వాచ్ ధర రూ.5 కోట్లు అని వస్తున్న వార్తలను హార్ధిక్ పాండ్యా ఖండించాడు. తనపై అనవసరంగా పుకార్లు పుట్టిస్తున్నారని అన్నాడు.
తాను దుబాయ్ నుంచి వచ్చే సమయంలో చాలా వస్తువులు కొనుక్కొని వచ్చానని, వాటికి అవసరమైన పన్నులు చెల్లించానని, ఇంకా ఏమైనా కస్టమ్స్ డ్యూటీ ఉంటే కూడా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పాండ్యా పేర్కొన్నాడు. నవంబర్ 15న తెల్లవారుజామున దుబాయ్ నుంచి ముంబై ఎయిర్పోర్టుకు చేరుకుని, తానే స్వయంగా కస్టమ్స్ అధికారుల వద్దకు వెళ్లినట్లు పాండ్యా పేర్కొన్నాడు. అధికారులకు తన వద్ద ఉన్న వస్తువులను చూపించి, అవసరమైన కస్టమ్స్ డ్యూటీ చెల్లించినట్లు వెల్లడించాడు.
కాగా ఈ విషయమై సోషల్ మీడియాలో మాత్రం తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే అసలు ఏం జరిగిందో చెప్పదల్చినట్లు పేర్కొన్నాడు. ప్రచారంలో ఉన్నట్లు తన వాచ్ ధర రూ.5 కోట్లు కాదని, కేవలం 1.5 కోట్లు మాత్రమే అని పాండ్యా స్పష్టం చేశాడు. తాను చట్టానికి లోబడి ఉండే వ్యక్తినని, అన్ని ప్రభుత్వ సంస్థలను తాను గౌరవిస్తానని, కస్టమ్స్ అధికారులకు తాను పూర్తిగా సహకరిస్తున్నట్లు వెల్లడించారు. చట్టాలను ఉల్లంఘించినట్లు తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని పాండ్యా పేర్కొన్నాడు.
కాగా హార్దిక్ పాండ్యా వద్ద అత్యంత ఖరీదైన, ప్రసిద్ధ కంపెనీలకు చెందిన వాచ్ కలెక్షన్ ఉంది. వీటిలో పటేక్ ఫిలిఫ్ నాటిలస్ ప్లాటినమ్ 5711 ఒకటి. జీక్యూ ఇండియా రిపోర్టు ప్రకారం ఈ వాచ్ మొత్తం ప్లాటినమ్తో తయారుచేయబడినది. ఈ వాచ్ లో 32 బాగెట్ కట్ ఎమరాల్డ్స్ పొదిగి ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ బ్రాస్ లెట్ కూడా ఉంటుంది. ఈ వాచ్ మరో ప్రత్యేకత ఏంటంటే.. కస్టమర్లు కోరిన విధంగా వారికిష్టమైన రీతిలో వాచ్ను తయారు చేసి ఇస్తారు. ఐపీఎల్ 2021 ప్రారంభానికి ముందుకు హార్దిక్ పాండ్యా ఈ ఖరీదైన వాచీని ధరించిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.
— hardik pandya (@hardikpandya7) November 16, 2021