ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. రానున్న పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1000 అందిస్తామంటూ కేజ్రీవాల్ ప్రకటించారు. వచ్చే ఏడాది పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో భాగంగా పంజాబ్ రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో ఆప్ ప్రభుత్వం ఏర్పటైతే గనుక రాష్ట్రంలోని 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళ బ్యాంక్ ఖాతాలోకి రూ.1000 జమ చేస్తామంటూ తెలిపారు.
ఇక రాష్ట్రంలోని ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది ప్రధాన పార్టీలు తెర వెనుక వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తాజాగా బీజేపీ సైతం రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సాగు చట్టాల రద్దు నిర్ణయం తీసుకుందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇక ఇదిలా ఉంటే 2017లో జరిగిన పంజాబ్ ఎన్నికల్లో 117 స్థానాలకు గాను ఆమ్ ఆద్మీ పార్టీ 20 స్థానాలను గెలుచుకుని రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మరీ రానున్న ఎన్నికల్లో ఆప్ ఎన్ని స్థానాలకు గెలుచుకుంటుందో చూడాలి.