వాషింగ్టన్ (ఇంటర్నేషనల్ డెస్క్)- కరోనా వైరస్ అంతకంతకు విజృంబిస్తోంది. కరోనాను వ్యాక్సిన్ తోనే అడ్డుకోగలమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఐతే భారత్ లాంటి దేశాల్లో కరోనా టీకా కొరత ఉండటంతో అంతా టీకా కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొది. కానీ అమెరికా లాంటి అగ్రదేశాల్లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. యూఎస్ లో వ్యాక్సిన్ వేసుకునేందుకు యువత అస్సలు ఆసక్తి చూపడం లేదు. చాలా వరకు యూత్ టీకా తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. దీంతో అమెరికా ప్రభుత్వం రంగంలోకి దిగింది. వ్యాక్సిన్ తీసుకోవాలంటూ యువతను బలవంతపెట్టకుండా.. వారంతంట వారే వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు వచ్చేలా బంపర్ ఆఫర్ ప్రకటించింది. వ్యాక్సిన్ వేసుకున్న యువతకు ఫ్రీగా బీరు బాటిల్ను అందించాలనే నిర్ణయానికి వచ్చింది.
అమెరికా అధినేత జో బైడెన్ తాజాగా మరో కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. జూలై 4 నాటికి 70 శాతం మంది 18 ఏళ్ల పైబడిన యువతకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దేశంలో 18 కోట్ల మందికి కనీసం ఒక డోసు, 16 కోట్ల మందికి రెండు డోసులు ఇచ్చేవిధంగా ప్రణాళికలు రూపొందించాలని జో బైడెన్ దీశానిర్ధేశం చేశారు. అయితే వ్యాక్సిన్ తీసుకునేందుకు యువత అంతగా ఆసక్తి చూపడం లేదన్న విషయాన్ని గుర్తించిన అధికారులు వారిని వ్యాక్సిన్ వైపు ఆకర్షించేందుకు ఈ బీర్ ఆఫర్ ను ప్రకటించారు. ఎవరైతే కరోనా టీకా వేసుకుంటారో వారికి బీర్ ఫ్రీగా ఇస్తామని అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో ప్రకటించారు. ఐతే వ్యాక్సిన్ తీసుకున్నాక వారం రోజుల తరువాతే బీర్ బాటిల్స్ ఇస్తామని అధికారులు చెబుతున్నారు.