టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న రోజులివి. ఇప్పుడిప్పుడే సమాజం నుంచి మూఢనమ్మకాలను, దురాచారాలను తరిమికొడుతున్నాం. ఇంత జరుగుతున్నా ప్రజల్లో మూఢనమ్మకాలపై ఆశలు పోవట్లేదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే.. ఈ సంఘటన. మీకు ఎవరికైనా మోకాళ్లు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఉంటే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటారేమో కానీ, మేము మాత్రం అదిగో ఆ హైవే మీద ఉన్న రాయిని పూజించి నొప్పలు తగ్గించుకుంటామంటున్నారు అక్కడి ప్రజలు. ఇంతకీ ఆ ప్రదేశం ఎక్కడుంది? ఎందుకిలా చెబుతున్నారు? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
ఎవరికైనా మోకాళ్లు, కీళ్ల నొప్పులు వస్తే ఆస్పత్రికి వెళ్తారు.. అక్కడ వైద్యులు ఇచ్చిన మందులను వాడుతారు లేదంటే ఆయుర్వేద వైద్యులను సంప్రదిస్తారు. కానీ, కర్ణాటకలోని చామరాజనగర్ ప్రజలు మాత్రం జాతీయ రహదారిపై ఉన్న రాయి దగ్గరకు వెళ్తారు. ఆ రాయికి మొక్కితే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయట. “యలందూర్ నుంచి మాంపల్లి వైపు వెళ్తున్న జాతీయ రహదారిపై ఓ రాయి చాలా ఏళ్లుగా ఉంది. అక్కడ నిత్యం పూజలు జరుగుతుంటాయి. ఈ పూజలు చేసేది ఎందుకో కాదు.. మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడేవారు. అక్కడికి వచ్చి పూజలు చేస్తే వారి ఆరోగ్య సమస్యలు తీరుతాయని నమ్ముతున్నారు. అంతే.. తండోపతండాలుగా అక్కడకొచ్చి పూజలు చేస్తున్నారు.
వీరికి తందానా అంటూ.. ఆ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులు కూడా ఇక్కడ దిగి మొక్కుతున్నారు. దీంతో ఆ పరిసరాలు నిత్యం రద్దీగా కనబడుతున్నాయి. అక్కడ ‘నారికల్లు మారమ్మ..’ అనే దేవత ఉందని స్థానికులు చెబుుతున్నారు. మోకాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడేవారు.. ఇక్కడకు వచ్చి పూజలు చేయడం వల్లే తమ ఆరోగ్య సమస్యలు కుదుటపడ్డాయని చెప్తున్నారు. ఈ రహదారి ఎంత రద్దీగా ఉన్నా భక్తులు మాత్రం ఇక్కడ పూజలు చేయకుండా వెళ్లట్లేదు. ఇదీ అక్కడ జరుగుతోంది.