సార్, నా పేరు తరుణ శర్మని. నన్ను రక్షించండి. నాకు చదువుకోవాలని ఉంది. నన్ను ఓ 40 ఏళ్ల వ్యక్తి ఇచ్చి తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేశారు. అతడు నన్ను శారీరకంగా, మానసికంగా, లైంగికంగా హింసిస్తున్నాడు. నాపై హత్యాయత్నం జరిగింది. సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు అంటూ ఓ యువతి చేసిన విన్నపం ఇప్పుడు వైరల్ అయ్యింది.
‘సార్, నా పేరు తరుణ శర్మ. నన్ను రక్షించండి. నాకు చదువుకోవాలని ఉంది. నన్ను ఓ 40 ఏళ్ల వ్యక్తి ఇచ్చి తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేశారు. అతడు నన్ను శారీరకంగా, మానసికంగా, లైంగికంగా హింసిస్తున్నాడు. నాపై హత్యాయత్నం జరిగింది. సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. సార్ నాకు బతకాలని ఉంది’అన్న సందేశం ట్విట్టర్లో నటుడు, సామాజిక కార్యకర్త సోనూసూద్ ట్యాగ్ చేసి ఉంది. అలాగే దేశ రాష్ట్రపతి, ప్రధానికి కూడా ఈ వినతి అందింది. ఇంత వేదన అనుభవిస్తున్న యువతి ఎవరూ.. ఎక్కడ నుండి మేసేజ్ చేసిందన్నకోణంలో ఆరా తీయగా విస్తు పోయే విషయాలు వెలుగు చూశాయి.
విచారణలో ఆ బాధితురాలికి చత్తీస్ఘడ్, రాజస్థాన్లతో సంబంధం ఉందని తేలింది. ఇంతకు ఆమె ఆ లేఖ రాయడానికి కారణాలేంటో దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. రాజస్తాన్లోని జోధ్ పూర్ జిల్లాలోని బాలేసర్ నివాసి తరుణ శర్మకు ఇటీవల కుటుంబ సభ్యులు చత్తీస్ఘడ్ నివాసితో పెళ్లి చేయగా.. అతడు హింసిస్తున్నాడని తేలింది. అతడికి రాఖీ కట్టానని చెబుతుంది. వినడానికి వింతగా అనిపిస్తున్న ఈ కథనం వెనుక మలుపు తిప్పుతున్న కోణాలు చూస్తే దిమ్మతిరగాల్సిందే. తరుణ శర్మ.. ఈ ఏడాది 13న తన చిన్ననాటి స్నేహితుడు సురేంద్ర సంఖ్లాను కోర్టు మ్యారేజ్ చేసుకుంది. తమ అనుమతి లేకుండా ఆమె ప్రేమ వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు తల్లిదండ్రులు.
ఈ క్రమంలో ఆమెను ఇంటికి తిరిగి రావాలంటూ ఒత్తిడి తీసుకురావడంతో పాటు సురేంద్ర నుండి తరుణను విడదీశారు. ఇంటికి వచ్చిన తర్వాత చత్తీస్ఘడ్లోని కాంకేర్ జిల్లా నివాసి అయిన జితేంద్ర జోషితో బలవంతంగా వివాహం చేశారు. అత్త ఇంటికి వెళ్లిన దగ్గర నుండి ఆమెకు వేధింపులు ఎక్కువయ్యాయి. తనకు ఇది వరకే పెళ్లైందని భర్త దగ్గర వాపోయింది. అతడు వినిపించుకోకపోవడంతో ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆసుపత్రిలో చేరినప్పుడు.. ఒకరి దగ్గర మొబైల్ ఫోన్ తీసుకుని సోనూసూద్, రాష్ట్రపతి, ప్రధానిలకు సందేశం పంపింది. ఈ పోస్టు వైరల్ అయ్యింది. దీంతో చత్తీస్ఘడ్ పోలీసులు అప్రమత్తమై కాంకేర్ జిల్లాలోని అంతగఢ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ రోషన్ కౌశిక్ ఆమె ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు.
తనకు తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేశారని, తన భర్తకు తాను రాఖీ కట్టానని తెలిపింది. దానికి సంబంధించిన వీడియో కూడా విడుదల అయ్యింది. ఇందులో తరుణ తన భర్త మణికట్టుకు రాఖీ కట్టినట్లు కనిపిస్తుంది. మీడియా కథనాల ప్రకారం తరుణ ఆత్మహత్యకు ప్రయత్నించిందని భర్త జితేంద్ర చెబుతున్నారు. అయితే మానసిక పరిస్థితి బాగోలేనందున పవిత్ర దారాన్ని కట్టుకున్నట్లు చెబుతున్నాడు. చివరకు తరుణను సఖీ ఫారెస్ట్ సెంటర్లో అప్పగించారు పోలీసులు. మొదటి భర్త మాట్లాడుతూ.. కులాలు వేరు కావడంతోనే తమను విడదీశారని, ఈ విషయంలో జోధ్పూర్ పోలీసులు కూడా మాకు సహాయం చేయలేదన్నారు. ఆ తర్వాత ఆమెకు బలవంతంగా మరో పెళ్లి చేసి.. రెండో భర్త హింసిస్తున్నాడంటూ వాపోయాడు. తమ పెళ్లికి సంబంధించిన ధ్రువ పత్రాలు చూపించి.. న్యాయం చేయాలని కోరుతున్నాడు.