పోస్టుమార్టం నిర్వహించన మెడికో లీగల్ కేసులు ఉండవు. పోస్టుమార్టం ద్వారా ఓ వ్యక్తి ఎలా చనిపోయాడు? ఏ కారణాలతో చనిపోయాడు అన్న విషయాలు తెలుస్తాయి. కేసులో కీలక పాత్ర పోస్టుమార్టం రిపోర్టుదే అవుతుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్వేత మరణం ఎంతటి సంచలనాన్ని సృష్టించే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెది హత్యా? లేక ఆత్మహత్యా అన్నది తెలియక ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి. ఒక్కోరు ఒక్కో విధంగా అనుకోసాగారు. అయితే, పోస్టుమార్టం రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత ఊహాగానాలకు తెరపడింది. కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఈ కేసులోనే కాదు మెడికో లీగల్ అన్ని కేసుల్లో పోస్టుమార్టం రిపోర్టు కీలక పాత్ర పోషిస్తుంది. ఇంతకీ పోస్టుమార్టం అంటే ఏమిటి? దాన్ని ఎందుకు? ఎలా చేస్తారు?
పోస్టుమార్టం అనే పదం లాటిన్ పదాలైన పోస్ట్(తర్వాత)మార్టం(మరణం)నుంచి వచ్చింది. చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని పరీక్షించటాన్నే పోస్టుమార్టం అంటారు. దీన్నే అటాప్సీ అని కూడా అంటారు. పోస్టుమార్టం ద్వారా వ్యక్తి మరణానికి గల సరైన కారణాలు తెలుస్తాయి. పోస్టుమార్టం ద్వారా ఎలా చనిపోయారు? ఎప్పుడు చనిపోయారు? చనిపోవటానికి ముందు వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి? వంటి విషయాలు తెలుస్తాయి. పోస్టుమార్టాన్ని పాథాలజీ డాక్టర్లు మాత్రమే చేస్తారు. 1734లో మొదటి సారి ఓ శవానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు రికార్డులు ఉన్నాయి.
ఏదైనా కేసుకు సంబంధించి చనిపోయిన వ్యక్తి శవానికి పోస్టుమార్టం చేయాల్సి వస్తే దాన్ని మెడికో లీగల్ అటాప్సీ అంటారు. సాధారణంగా అనుమానాస్పద మరణాలు, హత్యలు, ఆత్మహత్యలు, దాడుల్లో చనిపోయిన వారికి పోస్టుమార్టం నిర్వహిస్తూ ఉంటారు.
ఏదైనా వ్యాధికి సంబంధించిన వివరాలను తెలుసుకోవటానికి లేదా ఏదైనా పరిశోధన కోసం శవ పరీక్ష చేయాల్సి వస్తే దాన్ని క్లినికల్ పోస్టుమార్టం అంటారు. ఇలాంటి అటాప్సీలు ఎక్కువగా వ్యక్తి చనిపోవటానికి ముందు అతడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవటానికి చేస్తుంటారు.
ఇందులో వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులు శవ పరీక్ష చేస్తుంటారు.
మెడికో లీగల్ కేసుల్లో పోస్టుమార్టం తప్పని సరి అవుతుంది. పోలీసులు లేదా కోర్టుల అభ్యర్థనల మేరకు చనిపోయిన వ్యక్తికి పోస్టుమార్టం నిర్వహించటం జరుగుతుంది. అది కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే పోస్టుమార్టం నిర్వహిస్తారు. పాథాలజీ డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహిస్తారు. ఒక్కో కేసుకు ఒక్కో సమయం పడుతుంది. కేసును బట్టి గంటనుంచి మూడు గంటల సమయం పడుతుంది. పోస్టుమార్టంలో భాగంగా మొదట బాహ్య పరీక్ష చేస్తారు. ఇందులో చనిపోయిన వ్యక్తి ఎత్తు, బరువు, శరీరంపై గుర్తులు (గాయాలు, ట్యాటూలు) వంటి వాటితో పాటు శరీరంపై కనిపిస్తున్న వాటిని నమోదు చేస్తారు.
తర్వాత అంతర్గత పరీక్ష మొదలవుతుంది. ఇందులో భుజాల దగ్గరినుంచి రొమ్ముల మీదుగా మర్మాంగం వరకు శరీరాన్ని U సేపులో లేదా Y సేపులో కోస్తారు. తర్వాత చర్మం, లోపలి కండర భాగాన్ని పక్కకు తీస్తారు. శరీరంలోని ముఖ్యమైన భాగాలన్నింటిని బయటకు తీస్తారు. ఆ తర్వాత మెదడును బయటకు తీసే పక్రియ మొదలవుతుంది. పుర్రె వెనుక భాగాన్ని ఒక చెవి దగ్గరినుంచి మరో చెవి వరకు కోస్తారు. తర్వాత పైభాగాన్ని పైకి, కింద భాగాన్ని కిందకు తీస్తారు. అప్పుడు మెదడులోని అధిక భాగం బయటకు కనిపిస్తుంది. ఆ తర్వాత వైబ్రేటింగ్ కత్తితో పుర్రె పై భాగాన్ని తొలగిస్తారు.
ఆ వెంటనే మెదడును బయటకు తీస్తారు. బయటకు తీసిన వాటిని ప్రత్యేకంగా పరీక్ష చేస్తారు. కొన్నిసార్లు అవయవాలను హిస్టో పాథలాజికల్ పరీక్షకు పంపుతారు. విషం తాగి చనిపోయిన వారి కేసుల్లో పొట్ట, రెండు కిడ్నీల్లోని సగ భాగాలు, అర్థ కేజి లివర్ను, పొట్టపేగులోని ఓ భాగాన్ని స్థానిక ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపుతారు. పోస్టుమార్టం అయిపోయిన తర్వాత తీసిన భాగాలను లోపల పెట్టడం అన్నది పరిస్థితులను బట్టి ఉంటుంది. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత శరీరానికి కుట్లు వేసి డ్రెస్సింగ్ చేస్తారు.