అకాల వర్షాలు రైతన్నలకు కన్నీళ్లు మిగిల్చాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట వానకు దెబ్బతింటే ఓ రైతన్న తల్లడిల్లిపోయాడు. తన బాధ, ఆవేదనను పాట రూపంలో వ్యక్తం చేశాడు. ఈ పాట నెట్టింట వైరల్ అవుతోంది.
నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాల అన్నదాతలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. భారీ వర్షాలకు తోడు ఈదురు గాలులు, వడగళ్లు పడుతుండటంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షాలు, వడగళ్లకు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని సమాచారం. ఆరుగాలం శ్రమించి పంట పండించిన అన్నదాతలకు ఊహించిన విధంగా కురుస్తున్న అకాల వర్షాలు కన్నీళ్లను మిగులుస్తున్నాయి. వర్షాలకు వడగళ్ల వాన తోడవ్వడంతో యాసంగి పంటలకు భారీస్థాయిలో నష్టం వాటిల్లింది. ఉగాది పండుగకు ముందు అన్నదాతలు ఊహించని కష్టాల్లో పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అకాల వానల వల్ల చేతికి రావాల్సిన మొక్కజొన్న పంట, వరి, శనగ తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉద్యానవన పంటలకూ తీవ్ర నష్టం వాటిల్లింది.
మామిడి, మొక్కజొన్న రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా ప్రాథమిక అంచనా. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న తన పంటను చూసి ఓ మొక్కజొన్న రైతు కుంగిపోయాడు. తన ఆవేదనను ఒక పాట రూపంలో వ్యక్తం చేశాడు. ఇల్లందు మండలం, మర్రిగూడెం గ్రామ పంచాయతీలో రామ్మూర్తి అనే అన్నదాత సహజంగా గ్రామాల్లో సాంగ్స్తో అందరినీ ఆకట్టుకుంటుంటాడు. తాజాగా వర్షాల వల్ల దెబ్బతిన్న తన పంటను చూస్తూ ఓ పాట పాడాడీ రైతు. ‘ప్రకృతి కూడా మమ్మల్ని చిన్నచూపు చూస్తే మేమెలా బతకాలి?’ అంటూ వాపోయాడు. ‘ఎన్నితీర్లు నష్టపోతిరా.. రైతును ఆదుకునే దిక్కులేదురా..’ అంటూ రామ్మూర్తి పాడిన పాట అన్నదాతల దుస్థితికి అద్దం పడుతోంది.