ఒక కాన్పులో ఒకరు లేదా ఇద్దరు పిల్లలు పుట్టడం చూస్తున్నాం. కానీ ఓ మహిళకు ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
ఒక కాన్పులో ఒకరు పుట్టడం సహజమే. కొన్ని సందర్భాల్లో ఒకే కాన్పుల్లో ఇద్దరు శిశువులు పుట్టడాన్ని కూడా చూస్తున్నాం. కానీ ఒకే కాన్పుల్లో ఏకంగా ముగ్గురు లేదా నలుగురు పిల్లలు పుట్టడం అరుదుగానే చూస్తుంటాం. ఇలాంటి ఘటనే తెలంగాణలో చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్లోని పీపుల్స్ ఆస్పత్రిలో ఒక మహిళకు అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. గంబీరావుపేట మండలం, సముద్రలింగాపూర్కు చెందిన గొట్టుముక్కల లావణ్య అనే మహిళకు రెండో కాన్పులో ఏకంగా నలుగురు పిల్లలు జన్మించారు.
లావణ్యతో పాటు ఆమెకు పుట్టిన నలుగురు శిశువుల ఆరోగ్యం నిలకడగా ఉందని పీపుల్స్ హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు. ఈ మహిళకు తొలుత మగ శిశువు పుట్టాడు. ఆ తర్వాత ఆడ శిశువు, ఇద్దరు మగ శిశువులు జన్మించారని వైద్యులు చెప్పారు. తొలి కాన్పులో ఒక బాబు జన్మించిన దాదాపు 9 ఏళ్ల తర్వాత.. మళ్లీ ఇన్నాళ్లకు రెండో కాన్పులో ఆమెకు నలుగురు పిల్లలు పుట్టడం విశేషం. దీంతో లావణ్య కుటుంబీకులు ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. పుట్టిన శిశువులంతా ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్లు స్పష్టం చేశారు. అనంతరం తదుపరి చికిత్స కోసం కుటుంబసభ్యులు లావణ్యను, ఆమె పిల్లల్ని సిద్ధిపేటలోని చిల్డ్రన్ హాస్పిటల్కు తరలించారు.