ఓ విద్యార్థిని ఒక్కరోజు సెలవు తీసుకొని మరుసటి రోజు ఆలస్యంగా కళాశాలకు వచ్చినందుకు ఓ ఉపాధ్యాయురాలు ఒకటీ కాదు రెండు కాదు ఐదు రోజుల పాటు కళాశాల సమయంలో గంటల కొద్ది నిలబెట్టింది. దాంతో ఆ విద్యార్థిని కాళ్ళు చచ్చుబడిపోయాయి. ఈ దారుణమైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
పెద్దపల్లి జిల్లాకి చెందిన ఓ విద్యార్థిని వేములవాడలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా కళాశాలలో బీకాం కంప్యూటర్ ఫైనలీయర్ చదువుతుంది. ఈ నెల 18 న ఆ యువితికి అరోగ్యం బాగా లేకపోవడంతో సెలవు తీసుకుంది. తిరిగి 23 న కాలేజ్ కి వెళ్లింది. అయితే ఆ విద్యార్థి సెలవు తీసుకోవడంతో.. ఆలస్యంగా రావడంతో అద్యాపకురాలు డి. మహేశ్వరికి పట్టరాని కోపం వచ్చింది.
ఆ విద్యార్థినిని ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అలాగే నిల్చుని ఉండాలని శిక్ష విధించింది. వరుసగా ఐదు రోజులు అలా నిలబడటంతో ఆ విద్యార్థిని కాళ్లలో పూర్తిగా స్పర్శ కోల్పోయింది.. నడవలేని పరిస్థితికి చేరుకుంది. విద్యార్థిని దీనమైన పరిస్థితి చూసి చలించిపోయిన తోటి విద్యార్థినిలు వేములవాడ ఆసుప్రతిలో చేర్పించారు.
డాక్టర్లు ఆ విద్యార్థినిని పరీక్షించిన తర్వాత ఎమ్మారై స్కానింగ్ కోసం సిరిసిల్ల ఆస్పత్రికి పంపించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ విషయంపై స్పందించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వెంటనే అద్యాపకురాలు మహేశ్వరిని సస్పెండ్ చేస్తూ ఉత్తరువులు జారీ చేశారు. అంతే కాదు ఇంత జరుగుతున్నా ప్రిన్సిపల్ ఏం చేస్తున్నట్లు అని పై అధికారులకు సిఫార్సు చేసినట్లు ఉత్వర్వులో పేర్కొన్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.