పండగ సీజన్ లో ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంటుంది. మొన్న సంక్రాంతికి ఏపీకి వెళ్లే ప్రయాణికుల కోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా రథసప్తమి పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులను నడపనుంది టీఎస్ ఆర్టీసీ. ఈ నెల 28న రథసప్తమి సందర్భంగా భక్తులు ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. రద్దీ కారణంగా భక్తులు ఇబ్బందులు పడకూడదని.. వారి సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలకు వెళ్లేందుకు 80 ప్రత్యేక బస్సులను తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సహా జిల్లా కేంద్రాల నుంచి వేములవాడ, ధర్మపురి, యాదగిరిగుట్ట, మన్నెంకొండ, గూడెం వంటి ప్రముఖ ఆలయాలకు ప్రత్యేక బస్సులను నడపనుంది.
కరీంనగర్ నుంచి వేములవాడకు 10, ధర్మపురికి 10 బస్సులు.. నల్గొండ నుంచి యాదగిరిగుట్టకు 10 బస్సులు, ఆదిలాబాద్ నుంచి గూడెంకు 5 బస్సులు, మహబూబ్ నగర్ నుంచి మన్నెంకొండకు 10 బస్సులు, హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు నుంచి అనంతగిరికి 5 బస్సులు, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం, చిలుకూరు బాలాజీ ఆలయం.. సికింద్రాబాద్ మహంకాళి, హిమాయత్ నగర్ బాలాజీ తదితర ఆలయాలకు ప్రధాన ప్రాంతాల నుంచి 20 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. రథసప్తమి సందర్భంగా ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు సురక్షితంగా ఆలయాలకు చేరుకునేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. అవసరమైతే మరిన్ని బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మరి టీఎస్ ఆర్టీసీ భక్తుల కోసం 80 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.