గత కొంత కాలంగా తెలంగాణలో అధికార పార్టీ ప్రతి పక్ష పార్టీల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఎన్నికల్లో అధికార పార్టీపై బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ హవా బాగా తగ్గిపోయింది. కాంగ్రెస్ పార్టీని గాడిన పెట్టేందుకు.. మరింత బలం పుంజుకునేలా చేసేందుకు తెలంగాణలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న రేవంత్ రెడ్డిని పిసిసి చీఫ్ గా నియమించింది అధిష్టానం.
ఈ క్రమంలో పార్టీలోని సీనియర్లు.. జూనియర్లు అనే తేడా లేకుండా అందర్నీ కలుపుకుంటూ రేవంత్ రెడ్డి పార్టీని బలోపేతం చేస్తున్నారు. అంతే కాదు ఇతర పార్టీలోని నాయకులను తమవైపు తిప్పుకునే వ్యూహరచనలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే తెలంగాణలోని జిల్లాల్లో.. పర్యటించేందుకు సన్నద్ధమవుతున్నారు.
సభ్యత్వ నమోదు తో పాటు స్థానికంగా పార్టీ నాయకుల మధ్య ఉన్న విభేదాలు తదితర వాటిపై ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే మరో వారం రోజుల్లోనే.. జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు రేవంత్ రెడ్డి. పార్లమెంటు సమావేశాలు పూర్తికాగానే ఈ కార్యచరణ కు శ్రీకారం చుట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తన పర్యటన దోహదం చేస్తుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.