నేటికాలంలో చాలామంది దంపతుల్లో సర్ధుకునే స్వభావం కరువైంది. ప్రతి చిన్న విషయాన్ని గొడవగా మార్చుకుని పెద్దది చేసుకుంటున్నారు. అలా వారి మధ్య జరిగిన గొడవలో ఎవరో ఒకరు ఆవేశంతో దారుణాలకు పాల్పడుతున్నారు. వారు చావడమో లేదా ఎదుటివారిని చంపడమో చేస్తున్నారు. ఇలాంటి దంపతుల ఘర్షణలో అభం శుభం తెలియని చిన్నారులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ విషయంలో దంపతుల మధ్య జరిగిన చిన్న ఘర్షణ పెద్దదిగా మారింది. దీంతో భార్య తన పాప ముఖంపై దిండుతో అదిమి చంపి.. అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ లోని నాచారం పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ లోని నాచారంకు చెందిన తెలుగు చంద్రశేఖర్ కు, శ్రీ శివసాయినగర్ కు చెందిన దీపిక అలియాస్ చందన(27)తో 2019లో వివాహం జరిగింది. వీరికి రుత్విక అనే ఏడాది పాప ఉంది. చంద్రశేఖర్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. అమీర్ పేట్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న చంద్రశేఖర్ కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 4న తమ కూతురి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బంధువులు పాపకు బంగారు గొలుసు పెట్టారు. దాని విషయమై భార్యాభర్తల మధ్య తరచు ఘర్షణ జరుగుతున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో గురువారం మొదటి అంతస్తులోని గదిలోకి వెళ్లిన దీపిక.. గడియ పెట్టుకొని పాప మొహంపై దిండుతో అదిమి చంపివేసింది. అనంతరం ఉయ్యాలకు ఉపయోగించే తాడుతో తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం సమయంలో చంద్రశేఖర్ సోదరుడు వచ్చి డోర్ కొట్టగా ఎంతకు తలుపు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా దీపిక ఉరివేసుకుని కనిపించింది. ఆ పక్కనే ఏడాది పాప కూడా నిర్జీవంగా పడి ఉంది.
తలుపులు బద్దలు కొట్టి.. వారిద్దరిని నాచారం ప్రసాద్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వారు మృతి చెందినట్లు నిర్ధారించారు. అల్లుడే తమ కూతురిని, మనవరాలిని హత్య చేశాడని దీపిక తల్లిదండ్రులు ఆరోపించారు. ఆస్పత్రి వద్దే చంద్రశేఖర్ కుటుంబసభ్యులపై వారు దాడి చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.