వివాహ నమోదు ప్రక్రియను సులభతరం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు సర్కారు గుడ్న్యూస్ చెప్పింది.
కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోసం పెద్దగా తిప్పలు పడాల్సిన పని లేదు. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లాంటి సర్కారు పథకాలకు మ్యారేజ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా మారిన నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం నూతన వధూవరులకు భారీ ఊరటను కలిగించనుంది. ఇప్పటి నుంచి మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇక మీదట గ్రామ పంచాయతీ కార్యాలయాల్లోనే వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు.
బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీలోనే వివాహ నమోదు ప్రక్రియకు చర్యలు చేపట్టనుండటం విశేషం. కొత్త చట్టం ప్రకారం గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులకు పెళ్లిని నమోదు చేసే అవకాశాన్ని రాష్ట్ర సర్కారు కల్పించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ స్కీములకు దరఖాస్తు చేసుకునే కొత్త పెళ్లి జంటలకు కొంత వెసులుబాటు కలగనుంది. అదే సమయంలో బాల్య వివాహాలకు కూడా పెద్ద ఎత్తున తెరపడే చాన్స్ ఉందని అంటున్నారు.
ఇకపై గ్రామాల్లో వివాహానికి ముందే ఆయా గ్రామపంచాయతీల్లో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కోసం అప్లయ్ చేసుకోవాలి. ఆ తర్వాతే పెళ్లి చేసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. బాల్య వివాహాలను అడ్డుకునేందుకే ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టిందని నిర్మల్ జిల్లా, భైంసా ఎంపీడీవో గోపాలకృష్ణా రెడ్డి తెలిపారు. ఈ విషయంపై ప్రజాప్రతినిధులతో కలసి అధికారులు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. దీని వల్ల బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడటంతో పాటు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలతో మేలు చేకూరుతుందన్నారు. మరి.. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.