శ్రావణ మాసం అంటే శ్రవణ సంబంధమైన మాసం. వెంకటేశ్వరస్వామి వారి నక్షత్రం.. శ్రవణ నక్షత్రం. స్వామివారికి అమ్మవారు నిత్యానపాయిని. భగవంతుడు ఏ అవతారం తీసుకున్నా ఆయనను విడిచి అమ్మవారు ఉండదు. అందుకే అమ్మవారిని ‘నిత్యానపాయిని’ అంటారు.
శ్రావణ మాసం అనగానే మనందరికి గుర్తుకు వచ్చేది వరలక్ష్మీ వ్రతం. ఈ మాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజలు చేసుకుంటాం. ఆడవారంతా నోములు నోచుకుంటారు. తోటి ఆడవారికి వాయనాలు ఇస్తుంటారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పూజలు జరుపుకుంటున్నా సరే మరిన్ని విషయాలను తెలుసుకోవాలని ఆడవాళ్లలో ఆత్రుత ఉంటుంది. ఈ సంవత్సరం శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయి. భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకోవచ్చు. కొత్త బట్టలు కొంటారు. బంగారం కొనుక్కుంటారు. కొందరు మంచిరోజులు కాబట్టి నోములు పట్టుకుంటారు. గృహప్రవేశాలు, శుభకార్యాలు, పెళ్లిళ్లు జరుపుకుంటారు. మరి ఈ మాసానికి ఉన్న ప్రత్యేకతను తెలుసుకుందాం..
శ్రావణ మాసం అంటే శ్రవణ సంబంధమైన మాసం. వెంకటేశ్వరస్వామి వారి నక్షత్రం.. శ్రవణ నక్షత్రం. స్వామివారికి అమ్మవారు నిత్యానపాయిని. భగవంతుడు ఏ అవతారం తీసుకున్నా ఆయనను విడిచి అమ్మవారు ఉండదు. అందుకే అమ్మవారిని ‘నిత్యానపాయిని’ అంటారు. వారికి సంబంధించిన ఈ నెల లక్ష్మీప్రదమని, పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుందని చెబుతారు. ఈ సారి శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు, నాలుగు మంగళ వారాలు వస్తున్నాయి. శుక్రవారాలు లక్ష్మీదేవి పూజ, మంగళవారాలు గౌరీదేవి పూజలు చేసుకుంటే విశేషమైన ఫలితం లభిస్తుంది.
పౌర్ణమి ముందు శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటారు. ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి అమ్మవారి పూజ కొరకు ఇల్లు శుభ్రపరచుకుని, పూజకు సంబంధించిన అన్ని వస్తువులను సర్దుకుని పూజ మొదలు పెడతారు. కలశం పెట్టుకుని అమ్మవారిని ఆహ్వానించి పూజ జరుపుకుంటారు. పూజలో అమ్మవారిని ఏ పూలతోనైనా పూజించవచ్చు. చేమంతులైతే శ్రేష్టమైనవి. కమల పూలు ఒక్కటి దొరికినా.. లక్ష్మీదేవికి నివేదించాలి. అవి అందుబాటులో లేనిచో ఏ పూలైనా ఉపయోగించవచ్చు. అమ్మవారిపై భక్తి ప్రధానం. పూజలో అమ్మవారి అష్టోత్తర శతనామావళిని చదువుకోవాలి.
పూజ జరుపుకున్న తరువాత చివరలో అమ్మవారికి ఐదు రకాల వంటలతో నైవేద్యం పెడతారు. శనగపప్పుతో కూడిన నైవేద్యం కూడా సమర్పిస్తారు. అమ్మవారికి కొత్తబట్టలు, బంగారం పూజలో పెట్టి పూజిస్తారు. సాయంకాలం సమయంలో ముత్తైదువులకు పసుపు కుంకుమలతో వాయనాలను ఇచ్చిపుచ్చుకుంటారు. ఏ నియమాలు లేకుండా పూజ చేసుకునే వారు కూడా ఉంటారు. వారికి వీలైన ఓ శుక్రవారం పూజ చేసుకోవచ్చు. ఇక ఈ మాసంలో ఆలయ దర్శనం చేయాలనుకుంటే ఏవైనా విష్ణు దేవాలయాలను సందర్శించవచ్చు. విష్ణువుతో సాక్షాత్తు లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఏ విష్ణు ఆలయాలను దర్శించుకున్నా మంచి ఫలితం ఉంటుంది.