నవమాసాలు మోసి కనేది అమ్మ.. చందమామను చూపించి గోరు ముద్దులు తినిపించేది అమ్మ.. మన సంతోషంలో తన ఆనందాన్ని వెతుక్కుని మురిసిపోయేది అమ్మ.. కన్న పేగుబంధం కోసం తన ప్రాణాలను కూడా లెక్కచేయని మహామూర్తి అమ్మ. కానీ, అలాంటి తల్లిని ఏ పిల్లలు అక్కున చేర్చుకుంటున్నారు? రెక్కలొచ్చాక గూడును వదిలి తమ దారిన ఎగిరిపోతున్న పిల్లలే ఎక్కువ కనిపిస్తున్నారు. అయితే అలాంటి వారికి కనువిప్పు కలిగించే పని చేశాడు ఓ హైదరాబాద్ యువకుడు. కరోనాతో కన్నతల్లి దూరమైతే.. ఆమె నిలువెత్తు విగ్రహంతో ఇంట్లోనే గుడి కట్టేశాడు. నిత్యం పూజలు చేస్తూ.. అమ్మ తమ మధ్యే ఉందని మురిసిపోతున్నారు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ బోరంపేటకు చెందిన ఆళ్ల విజయలక్ష్మికి కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ఆమె కొవిడ్ బారిన పడ్డారు. చికిత్స అందించినా.. ఉపయోగం లేకుండా పోయింది. ఆ తల్లి తన పిల్లలను వదిలి వెళ్లిపోయింది. ఆమె లేని లోటును కన్న పిల్లలు భరించలేకపోయారు. ఆసమయంలోనే రామ్ కుమార్ కు ఓ ఆలోచన వచ్చింది. అమ్మకు గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే జైపూర్ లోని శిల్పులను కలిసి మూడు, నాలుగు నెలలు కష్టపడి వారితో అమ్మ విగ్రహం చేయించాడు. ఆ తర్వాత ఇంట్లోనే ఆమెకు గుడి కట్టేశాడు. అది చూసిన బంధువులు, స్థానికులు రామ్ కుమార్ ను ప్రశంసలతో ముంచెత్తారు. రామ్ కుమార్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.