అతడో టీచర్. పిల్లలకు పాఠాలు చెప్పాలి. ఒకవేళ వాళ్లు ఏమైనా తప్పు చేస్తే కొడతానని చిన్నగా భయపెట్టాలి కానీ అసలు చేయని తప్పుకు పిల్లల్ని చితక్కొట్టాడు. దీంతో అతడిపై కేసు నమోదైంది.
సాధారణంగా పిల్లలు అల్లరి చేస్తారు. టీచర్ ఎవరైనా వాళ్లకు అల్లరి చేయొద్దని సర్దిచెబుతారు. ఒకవేళ ఇంకా ఎక్కువగా అల్లరి చేస్తే తప్పని పరిస్థితుల్లో భయపెట్టడానికి కొడతారు. అయితే ఈ టీచర్ మాత్రం కాస్త వెరైటీ. ఆ విషయంలో తనకు భంగం కలిగించారని పిల్లలందరినీ చితకబాదాడు. ఇది తొలుత ఎవరికీ తెలీదు. పిల్లల తల్లిదండ్రులు.. సదరు చిన్నారుల ఒంటిపై గాయాలు చూసేసరికి అసలు విషయం బయటపడింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ టీచర్ కొట్టడానికి కారణమేంటి?
ఇక వివరాల్లోకి వెళ్తే.. వెంకటేష్ రేణుకల కుమారుడు ఆశీష్ కుమార్, మడ్ ఫోర్డ్ గవర్నమెంట్ స్కూల్ లో ఒకటో క్లాస్ చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం లంచ్ బ్రేక్ టైంలో పిల్లలెవరూ క్లాసులో లేకపోవడంతో రవికుమార్ అనే ఉపాధ్యాయుడు తరగతి గదిలో చిన్నగా నిద్రపోయాడు. విరామం తర్వాత పిల్లలు క్లాసులోకి వచ్చారు. దీంతో శబ్దం వచ్చింది. అయితే తన నిద్రకు భంగం కలిగిందని కోపం తెచ్చుకున్న రవికుమార్.. తన దగ్గరే ఉన్న స్కేలుతో పలువురు విద్యార్థులతో పాటు తన టేబుల్ దగ్గరే ఉన్న ఆశీష్ కుమార్ పిక్కలు, మోకాలి కింద భాగంలో కొట్టాడు.
అయితే ఉపాధ్యాయుడు రవికుమార్ కొట్టడం గురించి చిన్నారి ఆశీష్ కుమార్ తన తల్లిదండ్రులకు చెప్పలేదు. శుక్రవారం స్నానం చేయించినప్పుడు.. అతడి తల్లి కాలి కింద నల్లగా కమిలి ఉండటం గమనించింది. ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. స్కూల్ కు వెళ్లి నిలదీయగా.. రవికుమార్ తను కొట్టలేదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే మిగతా పిల్లలు కూడా తమని కొట్టారని చెప్పడంతో కార్ఖానా పోలీసు స్టేషన్ లో రవికుమార్ పై పోలీసు కేసు నమోదు చేశారు. మరి నిద్రాభంగం కలిగించారని టీచర్ పిల్లల్ని కొట్టడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.