గత కొంత కొంత కాలంగా తెలంగాణలో రాజకీయాలు బాగా హీటెక్కిపోతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వర్సెస్ బీజేపీకి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలిచిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఆయనకు సంబంధించి జమునా హేచరిస్ అసైన్డ్ భూములను కబ్జా చేసిన సంగతిపై వార్తలు సోషల్ మీడియాలో రచ్చ చేశాయి. జమునా హేచరీస్ భూముల వ్యవహారంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు షాక్ తగిలింది.
జమునా హేచరిస్ అసైన్డ్ భూములను కబ్జా చేసిన సంగతి నిజమేనని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు.జమునా హేచరీస్ భూములు తమ నుంచి లాక్కుని వ్యవసాయం చేసుకోనివ్వట్లేదని కొంత కాలం క్రితం ఒక ఫిర్యాదు వచ్చింది. దాంతో అప్పుడు ప్రాథమిక నివేదిక ఇచ్చాం. ఆ నివేదికలో 66 ఎకరాల అసైన్డ్ భూమి కబ్జాకు గురైందని అంచనా వేశాం. ఇప్పుడు సమగ్ర సర్వే చేశాక 70 ఎకరాల 30 గుంటలు అసైన్డ్ ల్యాండ్స్, సీలింగ్ ల్యాండ్ కబ్జా చేసుకున్నట్లుగా స్పష్టం అయినట్టు ఆయన తెలిపారు. 56 మందికి చెందిన 76 ఎకరాల 30 గుంటల భూమిని ఈటల దౌర్జన్యంగా లాక్కున్నట్లుగా తాము గుర్తించామని మెదక్ కలెక్టర్ వెల్లడించారు. సర్వే నెంబరు 97లో పౌల్ట్రీ పరిశ్రమ నిర్వహించారని వివరించారు. అసైన్డ్ భూములను వ్యవసాయేతర అవసరాలకు వాడుతున్నారు.
ఆ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే భారీ షెడ్లు నిర్మించారని వివరించారు. నిషేధిత జాబితాలోని భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి అటవీ ప్రాంతంలో చెట్లు నరికి, రోడ్లు వేశారు అని చెప్పారు. పౌల్ట్రీ నుంచి కాలుష్యం వెదజల్లుతున్నట్లు గుర్తించామని కలెక్టర్ పేర్కొన్నారు. అచ్చంపేట, హకీంపేట పరిధిలో అసైన్డ్ భూముల కబ్జా జరిగింది. అక్రమాలకు పాల్పడిన వారిపై, వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వానికి కూడా నివేదిక అందిస్తామని తెలిపారు.