తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నారు. రేపటితో ప్రచారం పూర్తి అవుతుంది.. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు ప్రచారాల హూరు కొనసాగిస్తున్నారు. తాజాగా మునుగోడు లో ప్రచారానికి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాన్వాపై రాళ్ల దాడి జరిగింది. మునుగోడు మండలం పలివెల గ్రామంలో ఆయన ప్రచారం చేస్తున్న సమయంలో కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.
ఈ క్రమంలో కొంతమంది బీజేపీ కార్యకర్తలకు గాయాలు కూడా అయ్యాయి. ఆయన కాన్వాయ్ అద్దాలు పగిలిపోయాయి. ప్రస్తుతం పలివెలలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. ఇంత దారుణం ఎక్కడా చూడలేదు.. ప్రశాంతంగా ప్రచారం చేసుకోవడానికి వస్తే.. తమపై రాళ్లదాడి చేయించారని.. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉరుకున్నారని.. అధికార పక్ష నేతలు కావాలనే తమపై రాళ్లదాడి చేయించారని అన్నారు.
రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుండగా.. మునుగోడులో అన్ని పార్టీల నేతలు విసృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాలు ప్రచారం చేస్తున్న సమయంలోనే ఘర్షణ జరిగినట్లు తెలుస్తుంది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు కర్రలతో దాడులు చేసుకున్నారు.. పోలీసులు వెళ్లి ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తీసుకు వచ్చినట్లు సమాచారం.