తెలంగాణ లో ప్రజలకు పోలీసులకు స్నేహభావం ఉండేలా ఫ్రెండ్లీ పోలీస్ వ్వవస్థని తీసుకొచ్చింది టీ సర్కార్. కానీ కొన్ని చోట్ల మాత్రం అందుకు భిన్నంగా సిబ్బంది వ్యవహరించే తీరు ప్రభుత్వానికి మచ్చ తేవడమే కాకుండా, ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. సూర్యాపేట జిల్లాలో పోలీసులు వ్యవహారించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జై భీమ్ సినిమా తరహాలో దొంగతనం కేసులో ఓ గిరిజనుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని చిత్రహింసలు పెట్టడంతో అతను ఆపస్మారక స్థితిలోకి వెళ్లి పోయినట్లు వార్తలు వస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలంలో రామోజీతండాకు చెందిన నవీన్ అనే యువకుడు గత కొద్ది నెలలుగా చోరీలకు పాల్పడుతున్నాడు. నవీన్ గత నెలలో మండలంలోని ఏపూర్ గ్రామంలోని ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న ఓ బెల్ట్ దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసు విచారణలో భాగంగా తనతో పాటు అదే గ్రామానికి చెందిన పలువురు చోరీలో పాల్గొన్నట్లు నవీన్ వాంగ్మూలం ఇచ్చాడు.
ఈ క్రమంలోనే గుగులోతు వీరశేఖర్ అనే గిరిజన యువకుడిని ఎస్ఐ లింగం స్టేషన్కు పిలిపించి దారుణంగా కొట్టినట్లు తెలుస్తోంది. తనకే పాపం తెలియదని చెప్పినా వినకుండా కాళ్లు కట్టేసి దారుణం హింసించినట్లు సమాచారం. ఎస్సై దాడిలో వీర శేఖర్ అస్వస్థతకు గురయ్యాడు. ఇంటికి వెళ్లిన తరువాత అతని పరిస్థితి మరింత విషమం కావడంతో బాధితుడిని తీసుకొని అతని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఎస్సైతో వాగ్వాదానికి దిగారు. అనంతరం సదరు యువకుడిని హాస్పిటల్కు తరలించారు. అయితే ఈ విషయం బయటికి పొక్కకుండా ఎస్ఐ అక్కడి పెద్దలతో రాజీ ప్రయత్నాలు చేపట్టినట్టు సమాచారం. కాగా, ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి ఎస్ఐపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.