పట్టపగలు, నడిరోడ్డు మీద అందరు చూస్తుండగానే ఓ యువకుడిపై కొందరు యువకులు కత్తులతో దాడికి దిగారు. ఎంత తప్పించుకునే ప్రయత్నం చేసినా వదలకుండా కసితీరా పొడిచారు. స్థానికులు చెదరగొట్టి.. వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఈ మధ్యకాలంలో హత్యలు చేయడం ప్రతి ఒక్కరికి ఈజీ అయిపోయింది. ఇంట్లో చిన్న గొడవలు జరిగినా కూడా వాటిని పరిష్కరించుకుందాం అనే ఆలోచన ఎవరికి రావడం లేదు. ఇంట్లో అన్నదమ్ముల మధ్య, భార్యభర్తల మధ్య, స్నేహితుల మధ్య ఏమైనా మనస్పర్థలు వస్తే అవి గొడవల దాకా తేకుండా సమసిపోయే పరిస్థితులు ఈ రోజుల్లో లేవు. ప్రాణాలు తీసే దాకా దారి తీస్తున్నాయి. స్నేహితులు ప్రాణానికి ప్రాణంగా ఉన్నట్లే ఉంటున్నారు. అందరు కలిసి గ్రూప్గా చేరి ఒకేచోట కలిసి తింటారు, తాగుతారు.. మాటామాటా పెరిగి గొడవల వరకు ముదురుతుంది. ఆ తర్వాత కత్తులతో, పగిలిన సీసా పెంకులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడుతున్నారు. తెల్లవారేవరకు ఎవరో ఒకరు మృతి చెందడం చూస్తూనే ఉన్నాం. అలాంటి సంఘటనే తాజాగా సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. పట్టపగలు.. నడిరోడ్డు మీద అందరి ముందు ఓ యువకుడిపై కత్తులతో మరికొందరు యువకులు దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారు. స్థానికులు చెదరగొట్టి బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
సూర్యపేట పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సంతోష్ అనే యువకుడి మీద తన పాత స్నేహితుడు వేరే కొంతమందితో కలిసి కత్తులతో దాడికి పాల్పడ్డారు. సంతోష్ తాళ్లగడ్డకు చెందన యువకుడు. సంతోష్, బంటి ఇద్దరు గతంలో మంచి స్నేహితులు. కాగా కొంతకాలంగా వారిఇరువురి మధ్య కొన్ని వివాదాలు తలెత్తాయి. ఇద్దరు విడిపోయారు. అయితే పాత కక్షల కారణంగా బంటి తన స్నేహితులతో కలిసి సంతోష్పై కత్తులతో దాడి చేసి.. అతన్ని చంపేందుకు ప్రయత్నించారు. తప్పించుకునేందుకు ప్రయత్నించినా సంతోష్ ను వదలకుండా కసితీరా కత్తులతో పొడిచారు. స్థానికులు ఎట్టకేలకు వారిని చెదరగొట్టారు. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించారు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడు సంతోష్ గతంలో గంజాయి కేసులో అరెస్టయినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సంతోష్ ప్రాణాపాయ స్థితి నుండి కోలుకున్నాడని వైద్యులు తెలిపారు.