సిద్దిపేట- తెలంగాణ ప్రభుత్వం రైైతులకు తీపి కబురు చెప్పింది. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బు జమ చేస్తామని ఆర్ఖిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై సిద్దిపేట కలెక్టరేట్ లో మంత్రి హరీష్ రావు అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం రైతులకు డబ్బులు చెల్లించేందుకు సీఎం కేసీఆర్ 26 వేల కోట్ల రూపాయలు సిద్ధంగా ఉంచారని హరీశ్ రావు చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బు జమ అవుతుందని ఆయన స్పష్టం చేశారు. రైతులు మిల్లులో ధాన్యం దించిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి కావాలని హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. ట్యాబ్ ఎంట్రీ పూర్తి కాగానే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని చెప్పారు.
టార్ఫలీన్, గన్ని బ్యాగుల కొరత, ట్రాన్స్పోర్టు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు హరీష్ రావు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు, చెల్లింపుల్లో ఆలస్యం జరిగితే కొనుగోలు కేంద్రం ఇంచార్జీ అధికారిదే బాధ్యత అని ఆయన హెచ్చరించారు. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాల్ని తీసుకొచ్చింది. రైతు బంధు, రైతు వేదిక అంటూ అనేక కార్యక్రమాలు చేపట్టింది. తాజాగా ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు చెల్లిస్తామని తెలంగాణ సర్కార్ చెప్పడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.