హైదరాబాద్ మహానగరంలో గత కొద్ది రోజులుగా వీధి కుక్కల విషయంలో పెద్దఎత్తున చర్చ, వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ ప్రాణాలు కోల్పోయిన ఘటనపై నగర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు వీధి కుక్కల విషయంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల నియంత్రణ విషయంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల అన్ని పార్టీల కార్పొరేటర్లు, ఎన్జీవోలు, అధికారులతో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీధి కుక్కల నియంత్రణ, కుక్కకాటు ఇబ్బందులు నివారణ, ఏబీసీ మానిటరింగ్ కమిటీ ఏర్పాటుకు తీర్మానించారు. ఆ తీర్మానం మేరకు వీధి కుక్కల నియంత్రణ విషయంలో హైలెవల్ కమిటీ ఏర్పాటుకు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో అన్ని పార్టీల నుంచి ఇద్దరు చొప్పున కార్పొరేటర్లను సభ్యులుగా ఉంచారు.
అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి రహమత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, చిలుకానగర్ కార్పొరేటర్ గీతా ప్రవీణ్, కాంగ్రెస్ నుంచి లింగోజీగూడ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ కార్పొరేటర్ రజిత, బీజీపీ పార్టీ నుంచి బాగ్ అంబర్ పేట్ కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డి, మల్కాజ్ గిరి కార్పొరేటర్ శ్రావణ్, ఎంఐఎం నుంచి పత్తర్ గట్టి కార్పొరేటర్ సయ్యద్ సోహెల్ ఖాద్రీ, రియాసత్ నగర్ కార్పొరేటర్ మిర్జా ముస్తఫా బేగ్ లు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ జీహెచ్ఎంసీ పరిధిలోని జంతు సంరక్షణ కేంద్రాలను పరిశీలించి వాటి అభివృద్ధికి అవసరమైన సలహాలు ఇవ్వడం, నివేదిక అందజేయడం చేస్తారు. ఈ కమిటీకి డాక్టర్ జేడీ విల్సన్ ను కో-ఆర్డినేట్ అధికారిగా నియమించారు.
ఫిబ్రవరి 19న అంబర్ పేట్ లో కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కలపై ప్రజల నుంచి వ్యతిరేకత, ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఈ విషయంలో ఆర్జీవీ సైతం బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాలుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. జీహెచ్ఎంసీ రూ.8 లక్షలు, కార్పొరేటర్ల జీతం నుంచి రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వీధి కుక్కల నియంత్రణ కోసం జీహెచ్ఎంసీ హై లెవల్ కమిటీని ఏర్పాటు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.