కిడ్స్ ప్లే స్కూల్ లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడంతో భయంతో చిన్నారులు బయటకు పరుగులు తీశారు. తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు.
హైదరాబాద్ లోని మణికొండలోని జాలీ కిడ్స్ ప్లే స్కూల్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో విద్యార్థులు, సిబ్బంది బయటకు పరుగులు తీశారు. స్థానికులు మున్సిపల్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం గురించి తెలుసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు స్కూల్ వద్దకు పరుగులు తీశారు. తమ పిల్లలు సురక్షితంగా ఉన్నారని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పిల్లలను తమ ఇంటికి తీసుకెళ్లిపోయారు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన జరిగింది. కాగా స్కూల్ యాజమాన్యంపై చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉండడం ఏమిటని స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. అదృష్టం బాగుండి పిల్లలు బయటపడ్డారు కాబట్టి సరిపోయింది కానీ ఏదైనా జరగరానిది జరిగితే ఏం చేసేవారని అంటూ నిలదీశారు.