సోషల్ మీడియా ప్రభావమో, సినిమా ప్రభావమో తెలియదు కానీ.. ఈ దొంగతనాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వీరి ఆగడాలు మాత్రం రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. మారు వేషాల్లో దర్జాగా వచ్చి దోచుకుంటున్నారు. నకిలీ పోలీస్ ఆఫీసర్లు, అధికారులు దొంగ బాబా వేషాలు వేసి.. సినిమా రేంజ్లో నటించి దోపిడీలకు పాల్పడుతున్నారు.
ఇప్పుడు దొంగలు తెలివి మీరుతున్నారు. గతంలో అర్థరాత్రి పూట కన్నాలు వేసేవారు. ఎవ్వరూ లేరని గమనించుకున్నాక ఇళ్లకు, దుకాణాలను ఖాళీ చేసేవారు. అయితే సోషల్ మీడియా ప్రభావమో, సినిమా ప్రభావమో తెలియదు కానీ.. ఈ దొంగతనాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వీరి ఆగడాలు మాత్రం రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. మారు వేషాల్లో దర్జాగా వచ్చి దోచుకుంటున్నారు. నకిలీ పోలీస్ ఆఫీసర్లు, అధికారులు, దొంగ బాబా వేషాలు వేసి.. సినిమా రేంజ్లో నటించి దోపిడీలకు పాల్పడుతున్నారు. చివరకు వచ్చింది నకిలీ అధికారులు అని తెలుసుకుని.. లబోదిబోమంటున్నారు. ఇవే సినిమాలకు ప్రేరణ అవుతున్నాయో, సినిమాలను చూసి ఇలా తయారయ్యారో తెలియడం లేదు. అయితే గ్యాంగ్ సినిమా తరహాలో ఓ ముఠా వచ్చి సుమారు 2 కిలోల బంగారంతో ఉడాయించిన ఘటన సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో పట్టపగలు జరిగింది.
సూర్య, కీర్తి సురేష్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలుగా నటించిన సినిమా ‘గ్యాంగ్’. ఈ సినిమాలో నకిలీ ఐడీలు సృష్టించి.. తాము ఆదాయపు పన్ను శాఖ అధికారులమంటూ సోదాలు చేపడతారు ఈ దొంగల ముఠా. సేమ్ అదే సీన్ తరహాలో జరిగింది సికింద్రాబాద్లో. శనివారం పట్టపగలు తాము ఐటి అధికారులమంటూ చెప్పి ఓ గోల్గ్ షాపులోకి వెళ్లి తనిఖీలు చేపట్టింది ఓ గ్యాంగ్. అనంతరం రెండు కేజీల బంగారు నగలతో ఉడాయించింది. వివరాల్లోకి వెళితే.. మోండా మార్కెట్లో ఉన్న బాలాజీ జ్యువెలరీ దుకాణానికి వెళ్లిన ఈ ముఠా.. తాము ఐటి అధికారులమనీ, బంగారం కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారంటూ.. తనిఖీ చేయాలంటూ బెదిరించారు. కొంచెం సేపు తనిఖీ చేస్తున్నట్లు నటించి.. 1700 గ్రాముల బంగారానికి సంబంధించి ఎలాంటి ట్యాక్స్ కట్టలేదని చెప్పి.. మొత్తాన్ని స్వాధీనం చేసుకుని, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్లిపోయారు.
ఆ దుకాణ యజమాని.. మరి కొంత మంది జ్యువెల్లరీ దుకాణదారులకు సమాచారం అందించాడు. అయితే ఐటి అధికారులు తనిఖీ చేయరని, ముందుగా నోటీసులు ఇస్తారని చెప్పడంతో బాధితుడు లబోదిబోమన్నాడు. వెంటనే మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్కు వెళ్లి.. ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు… సీసీటీవీ ఫుటేజ్ లు పరిశీలించగా.. ఐదుగురు వ్యక్తులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దోపిడీ తర్వాత వీరంతా ఉప్పల్ వైపు వెళ్లినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి.. దొంగల ముఠా కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే ఇదంతా బాగా తెలిసిన వారి పనేనని పోలీసులు భావిస్తున్నారు. నాలుగు నెలల క్రితమే మహారాష్ట్రకు చెందిన రివెన్ మధుకర్ ఈ షాపును పెట్టాడని, మధుకర్ సొంతూరు వెళ్లగా..షాపును బావమరిదికి అప్పగించిన సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. మొత్తం 17 బంగారం బిస్కట్లను దోచుకెళ్లారన్నారు. అది ఒక్కోటి వంద గ్రాములు ఉంటుందని చెప్పారు.