వాట్సాప్ అనేది ప్రతి స్మార్ట్ ఫోన్ యూజర్ తప్పకుండా వాడే మెసేజింగ్ యాప్ గా మారిపోయింది. వారి మెసేజ్ అవసరాల కోసం మాత్రమే కాకుండా వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ కోసం కూడా వాట్సాప్ ని వాడుతున్నారు. అయితే వాట్సాప్ లో ఏది పడితే మాట్లాడతాం, ఎలాంటి మెసేజ్ లు అయినా పంపుతాం అంటే మాత్రం ఇలాగే మీ అకౌంట్ కూడా బ్యాన్ అవుతుంది.
వాట్సాప్ తెలియని స్మార్ట్ ఫోన్ యూజర్లు ఉండరేమో? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మెసేజెస్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ కోసం మాత్రమే కాకుండా.. ఆఫీస్ అవసరాల కోసం కూడా వాట్సాప్ ని వాడుతున్నారు. మంచికే కాకుండా చెడుకు కూడా వాట్సాప్ ని వాడుకుంటున్న విషయం తెలిసిందే. గతంతో పోలిస్తే ఇప్పుడు వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్స్ వల్ల తప్పుడు సమాచారం కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వాల నుంచి కూడా కఠిన చర్యలు ఉన్నాయి. వాట్సాప్ సైతం అసత్యాలు ప్రచారం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటోంది. అలాంటి చర్యల్లో భాగంగానే వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేస్తున్నారు.
వాట్సాప్ లో చట్టవ్యతిరేక కార్యక్రమాలు, అసత్య ప్రచారాలు, హేట్ స్పీచ్, దుర్భాషలాడటం వంటి పనులు చేస్తే అకౌంట్ ని బ్లాక్ చేస్తారు. మీరు సదరు అకౌంట్ పై ఫిర్యాదు చేసి.. సరైన ఆధారాలను చూపితే ఆ అకౌంట్ ని వాట్సాప్ బ్లాక్ చేస్తుంది. అయితే ఇప్పుడు వాట్సాప్ బ్యాన్ చేసిన అకౌంట్ల సంఖ్య అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఎందుకంటే ఒక్క మార్చి నెలలోనే వాట్సాప్ 47,15,906 ఖాతాలను బ్యాన్ చేసింది. ఫిబ్రవరిలో ఆ సంఖ్య 4.6 మిలియన్ ఉండగా.. మార్చి నెలలో 4.7 మిలియన్లకు చేరింది. వీటిలో 17 లక్షల అకౌంట్లను ఎలాంటి ఫిర్యాదు రాకముందే వాట్సాప్ బ్యాన్ చేసింది.
సమస్య వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే.. సమస్య వస్తుందేమో అని గ్రహించి స్పందించడం మంచిది కదా అని వాట్సాప్ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. అందుకు అబ్యూజ్ డిటెక్ట్ సిస్టమ్ అని ఉంటుంది. అది మొత్తం 3 దశల్లో అకౌంట్లను గుర్తిస్తుంది. రిజిస్ట్రేషన్ చేసే సమయంలో, మెసేజెస్ చేసేటప్పుడు, యూజర్లు రిపోర్ట్ అండ్ బ్లాక్ కొట్టే సమయంలో డిటెక్ట్ చేస్తుంది. అలా ఫిర్యాదులు వచ్చిన యూజర్లను మాత్రమే కాకుండా.. వీళ్లతో ఇబ్బంది ఉంటుందేమో అని భావించిన వారిని కూడా వాట్సాప్ అబ్యూజ్ డిటెక్ట్ సిస్టమ్ బ్యాన్ చేస్తోంది. అందుకే మీరు వాట్సాప్ లో మెసేజెస్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. లేదంటే ఆ సిస్టమ్ మీ వాట్సాప్ ని కూడా బ్యాన్ చేసే ప్రమాదం ఉంటుంది.